న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: చమురు నుంచి టెలికం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించాయి. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.13,227 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన రూ.6,348 కోట్లతో పోలిస్తే రెండు రెట్లు పెరుగగా..డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ.13,101 కోట్లతో పోలిస్తే ఒక్క శాతం అధికమైంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13 శాతం ఎగబాకి రూ.1,72,095 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. కన్జ్యూమర్, రిటైల్, టెలికం, పెట్రోకెమికల్ వ్యాపారాలు వృద్ధి బాటపట్టడం ఆర్థిక ఫలితాల్లో రాణించడానికి దోహదం చేశాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.5,39,238 కోట్ల ఆదాయంపై రూ.53,739 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఆదాయం 18.3 శాతం తగ్గగా, లాభంలో మాత్రం 35 శాతం వృద్ది కనబరిచింది.
టెలికం వెంచర్ జియో లాభాల్లోనూ దూకుడును కొనసాగించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,508 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన లాభంతో పోలిస్తే ఇది 47.5 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 19 శాతం అధికమై రూ.18,278 కోట్లకు ఎగబాకింది. గతేడాది చివరినాటికి జియోకు 42.62 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఒక్కో వినియోగదారుడి నుంచి సంస్థకు రూ.138.20 ఆదాయం సమకూరింది. డిసెంబర్ త్రైమాసికంలో వచ్చిన రూ.151తో పోలిస్తే ఇది తక్కువ.
ఆర్ఐఎల్ అనుబంధ సంస్థయైన రిలయన్స్ రిటైల్ దూకుడును కొనసాగించింది. గత త్రైమాసికంలో రిటైల్ రూ.2,247 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2019-20 ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించినదాంతో పోలిస్తే 45 శాతం అధికం. అటు ఆదాయంలోనూ 24.4 శాతం బలపడి రూ.47,064 కోట్లుగా ఉన్నది. కరోనా వైరస్ కారణంగా గతేడాది కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కొత్తగా 1,456 స్టోర్లను ప్రారంభించినట్లు, తద్వారా 65 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించినట్లు తెలిపింది. వీటిలో గత నాలుగో త్రైమాసికంలోనే 826 స్టోర్లను ప్రారంభించడం గమనార్హం. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 12,711కి చేరుకున్నాయి.
మార్చి చివరినాటికి కంపెనీ అప్పు రూ.2,57,413 కోట్ల నుంచి రూ.2,51,811 కోట్లకు తగ్గింది.
ఇదే సమయంలో సంస్థ వద్ద నగదు నిల్వలు రూ.2,20,524 కోట్ల నుంచి రూ.2,54,019 కోట్లకు పెరిగాయి.
ఇప్పటి వరకు రిలయన్స్ జియో రూ.1,52,056 కోట్ల నిధులను సేకరించగా, రిటైల్ రూ.47,265 కోట్లను సేకరించింది.
‘ఆయిల్ నుంచి చమురు, రిటైల్, డిజిటల్ రంగాలు భారీ వృద్ధిని కనబరిచాయి. కరోనా వైరస్తో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో 75 వేల మందికి ఉద్యోగాలు సృష్టించగలిగాం. ప్రస్తుతం జియోకు 42 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.
ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ