42వేల కోట్లతో నెదర్లాండ్స్ కంపెనీ కొనుగోలుకు ప్రయత్నాలు
న్యూఢిల్లీ, ఆగస్టు 10: ముకేశ్ అంబానీ తన టెలికాం వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించాలని భావిస్తున్నారు. ఈ దిశగా నెదర్లాండ్స్ టెలికాం కంపెనీ టీ-మొబైల్ కొనే ప్రయత్నాల్ని చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. టీ-మొబైల్ను 5 బిలియన్ యూరోలకు (5.9 బిలియన్ డాలర్లు, రూ.42,000 కోట్లు) విక్రయించాలని ప్రమోటింగ్ సంస్థ డాయిష్ టెలికాం చూస్తున్నది.
అమెరికాకు చెందిన ఎనర్జీ స్టోరేజ్ కంపెనీ ఆంబ్రిలో 50 మిలియన్ డాలర్లను (రూ.370 కోట్లు) రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడి చేసింది. రిలయన్స్తో పాటు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్, మరికొంతమంది ఇన్వెస్టర్లు కలిసి ఆంబ్రిలో మొత్తం 144 బిలియన్ డాలర్లు పెట్టుబడి చేశారు.
తమ సబ్సిడరీ అయిన రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ (ఆర్ఎన్ఈఎస్ఎల్) ద్వారా ఆంబ్రిలో 4.23 కోట్ల షేర్లను 50 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
లీథియం ఇయాన్ బ్యాటరీలకు సంబంధించిన ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఆంబ్రి.. ఇండియాలో కూడా భారీ బ్యాటరీ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటుచేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు రిలయన్స్ తెలిపింది.