న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ఈ ఏడాదికిగాను ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ అత్యుత్తమ సంస్థల ర్యాంకుల్లో భారత్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఫోర్బ్స్ 750 సంస్థలకు ర్యాంకులివ్వగా, అంతర్జాతీయ స్థాయిలో రిలయన్స్ 52వ స్థానాన్ని దక్కించుకున్నది. వరల్డ్ నంబర్ 1 కంపెనీగా సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ఉన్నది. ఐబీఎం, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, ఆల్ఫాబెట్, డెల్, హువావీ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక టాప్-100లో రిలయన్స్తోపాటు ఐసీఐసీఐ బ్యాంక్ (65), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (77), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (90)లున్నాయి. తెలుగు రాష్ర్టాలకు చెందిన అమర రాజా గ్రూప్ 405వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థల్లో ఎస్బీఐ (119), ఎల్అండ్టీ (127), బజాజ్ (215), యాక్సిస్ బ్యాంక్ (254), ఇండియన్ బ్యాంక్ (314), ఓఎన్జీసీ (404), కొటక్ మహీంద్రా బ్యాంక్ (418), బ్యాంక్ ఆఫ్ ఇండియా (451), ఐటీసీ (453), సిప్లా (460), బీవోబీ (496), ఎల్ఐసీ (504), ఇన్ఫోసిస్ (588), టాటా గ్రూప్ (746) ఉన్నాయి. ఉద్యోగులు తమ బంధు మిత్రులకు తాము పనిచేస్తున్న సంస్థను ఎంతవరకు సిఫార్సు చేస్తారు? ఇతర పోటీ సంస్థలపైనున్న అభిప్రాయం, లింగ సమానత్వం, సామాజిక బాధ్యత, ప్రతిభకు ప్రాధాన్యత, ఆర్థిక పరిపుష్ఠి, బ్రాండ్ అంశాల్లో అభిప్రాయాలను సేకరించారు.