సీజనల్వ్యాధులపైప్రజలను అప్రమత్తం చేయాలి
డీఎల్పీవో వెంకటేశ్వర్లు
గ్రామాల్లో పారిశుధ్య, అభివృద్ధి పనుల పరిశీలన
చెన్నారావుపేట, జూన్ 20: మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనుల్లో వేగం పెంచాలని డీఎల్పీవో వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ఆయన ఎంపీవో సురేశ్తో కలిసి చెన్నారావుపేట, తిమ్మరాయినీపహాడ్, ధర్మాతండా, పాపయ్యపేటలో కొనసాగుతున్న పారిశుధ్య, అవెన్యూ ప్లాంటేషన్ పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు కుండె మల్లయ్య, కొండవీటి పావని, ఆంగోత్ అరుణ, ఉప్పెర లక్ష్మి, కార్యదరుల్శు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చెత్తను రీసైక్లింగ్ చేయాలి
దామెర: డంపింగ్ యార్డుల్లో చెత్త రీసైక్లింగ్ పనులు చేపట్టాలని డీఎల్పీవో కల్పన సూచించారు. పులుకుర్తి, దామెరలో డంపింగ్ యార్డులను ఆమె పరిశీలించారు. గ్రామాల నుంచి తీసుకొచ్చే చెత్తాచెదారం నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసే పనులు ప్రతి రోజు జరుగాలన్నారు. ఆమె వెంట ఎంపీవో యాదగిరి, సర్పంచ్లు అశోక్, శ్రీరాంరెడ్డి, కార్యదర్శి నరేశ్ ఉన్నారు.
వైకుంఠధామాల పనులు పూర్తి చేయాలి
పర్వతగిరి: గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణ పనులను పూర్తి చేయాలని డీఎల్పీవో కీర్తి ప్రభాకర్ ఆదేశించారు. మండలంలోని గోపనపెల్లి, జమాలపురం, అనంతారం, కొంకపాక, హత్యానాయక్తండా, రోళ్లకల్, సోమారం, నారాయణపురం, పర్వతగిరి, అన్నారం, పెద్దతండా, చౌటపెల్లిలో ఆయన పర్యటించారు. శ్మశాన వాటికలు సకాలంలో పూర్తి చేయకపోతే సర్పంచ్లు, కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలోని 33 జీపీల్లో పారిశుధ్య పనుల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సహించేది లేదన్నారు. కాగా, వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేశ్ ఆధ్వర్యంలో సిబ్బంది మండలకేంద్రంలో డ్రైనేజీలను శుభ్రం చేశారు. చెత్తాచెదారాన్ని తొలగించి వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. కార్యక్రమంలో సిబ్బంది కరుణాకర్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల పరిశుభ్రతకు పెద్దపీట
ఖానాపురం/దుగ్గొండి/గీసుగొండ: గ్రామాల పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ఎంపీవో పర్వీన్ కైసర్ సూచించారు. ధర్మరావుపేటలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. వానకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లో వీధులను శుభ్రం చేయడంతోపాటు డ్రైనేజీల్లో చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీవో వెంట కార్యదర్శి కాసుల రాంబాబు, పూర్ణచందర్ ఉన్నారు. దుగ్గొండి మండలంలోని శివాజీనగర్లో కార్యదర్శి వినోద్కుమార్ శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి హరితహారం మొక్కల చుట్టూ ఉన్న కలుపు మొక్కలను తొలగించారు. సిబ్బందితో డ్రైనేజీలను శుభ్రం చేయించారు. మొక్కలకు ట్రీగార్డులు అమర్చారు. కార్యక్రమంలో సర్పంచ్ లింగంపల్లి ఉమారవీందర్రావు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మాలగాని రామారావు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గీసుగొండ మండలం మరియపురం గ్రామానికి సీఎం కేసీఆర్ వచ్చే సూచనలు ఉండడంతో సర్పంచ్ అల్లం బాలిరెడ్డి ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేయించారు. శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, నర్సరీ, విలేజ్పార్కుల్లో చెత్తాచెదారాన్ని తొలగించారు.