హైదరాబాద్, మే 17(నమస్తే తెలంగాణ): కరోనా వైరస్పై పోరులో తెలుగు రాష్ర్టాలకు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆపన్న హస్తం అందించింది. తెలంగాణ, ఏపీల్లో కొవిడ్-19 సహాయక చర్యల్లో పాల్గొనే ప్రభుత్వ అత్యవసర సేవలకు చెందిన వాహనాలు, అంబులెన్స్లకు ఉచిత ఇంధనాన్ని అందిస్తామంటూ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా రిలయన్స్ బంకుల్లో రోజుకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా 50 లీటర్ల వరకు పెట్రోల్, డీజిల్ పోయనున్నారు. జూన్ 30దాకా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అయితే సంబంధిత ప్రభుత్వ అధికారులు జారీ చేసిన అనుమతి లేఖల ఆధారంగానే ఈ ఉచిత సౌకర్యం లభిస్తుంది.
కరోనా మహమ్మారి విజృంభణతో తీవ్రంగా ఏర్పడిన ఆక్సిజన్ కొరత సమస్యను అధిగమించేందుకూ రిలయన్స్.. రెండు తెలుగు రాష్ర్టాలకు చేయూతనిచ్చింది. తెలంగాణకు 80 టన్నులు, ఏపీకి 80 టన్నుల చొప్పున మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ను సమకూర్చింది. ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈ కంటైనర్లను తమ జమ్నగర్ ప్లాంట్ నుంచి హైదరాబాద్, గుంటూరు రైల్వేస్టేషన్లకు రిలయన్స్ ఆదివారమే చేర్చింది. దేశవ్యాప్తంగా వెయ్యి మెట్రిక్ టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ను రిలయన్స్ సరఫరా చేస్తున్నది. దేశీయ ఆక్సిజన్ ఉత్పత్తిలో ఇది 11 శాతానికి సమానం. ఈ ఆక్సిజన్ రవాణా కోసం 32 ఐఎస్వో కంటైనర్లను రిలయన్స్ దిగుమతి చేసుకోవడం విశేషం.