న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూ) వాడుతున్న వాహనాల్లో 15 ఏండ్లు దాటిన వాటికి వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ పునరుద్ధరించరాదని కేంద్రం ప్రతిపాదించింది. దీనిపై అభిప్రాయం తెలియ జేయాలని ప్రజలను కోరింది. ఈ మేరకు ఈ నెల 12వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో వచ్చేనెల 12వ తేదీలోపు ప్రజలు ఈ అంశంపై తమ అభిప్రాయం వెల్లడించాల్సి ఉంటుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపాలిటీలు, స్వతంత్ర సంస్థలతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 15 ఏండ్లు దాటిన వాహనాలకు రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయరాదని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే పాత వాహనాల స్థానే సీఎన్జీ, కాలుష్య రహిత ఇంధన వాహనాల వాడకాన్ని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి.