హైదరాబాద్: రెడ్మీ సంస్థ భారత మార్కెట్లలోకి సరికొత్త స్మార్ట్ టీవీలను ( Redmi smart TVs ) లాంచ్ చేసింది. ఈ స్మార్ట్టీవీలను 32, 43 అంగుళాల వేరియంట్లలో తీసుకొచ్చింది. ఈ స్మార్ట్టీవీల్లో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, డాల్బీ ఆడియోను ఈ స్మార్ట్టీవీలు కలిగి ఉన్నాయి. 32 అంగుళాల వేరియంట్ ధరను రూ.15,999గా, 43 అంగుళాల వేరియంట్ ధరను రూ.25,999గా రెడ్మీ నిర్ణయించింది.
అయితే, ఈ స్మార్ట్టీవీల అమ్మకాల తేదీని రెడ్మీ ఇంకా ప్రకటించలేదు. దీపావళి పండుగ సందర్భంగా స్మార్ట్టీవీలను రెడ్మీ విక్రయించనున్నట్లుగా తెలుస్తున్నది. ఈ స్మార్ట్టీవీలు ఎమ్ఐ.కామ్, అమెజాన్ సైట్లో అందుబాటులో ఉండనున్నాయి. సేల్లో భాగంగా రెడ్మీ స్మార్ట్టీవీలను అదనపు తగ్గింపుతో ప్రత్యేక ధరలకు అందించనుంది. హెచ్డీ డిస్ప్లే, హెచ్డీఎమ్ఐ సపోర్ట్, యూఎస్బీ, బ్లూటూత్ 5.0 మొదలైనవి ఈ స్మార్ట్ టీవీల్లోని ఇతర ప్రత్యేకతలు.