హైదరాబాద్ : రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి నుంచి గాలులు లోయర్ ట్రోపోస్పీయర్ వరకు బలంగా వ్యాపించి, చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని పేర్కొంది. అండమాన్ దీవుల్లోకి శుక్రవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని అనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
ఇది మరింత బలపడి 24వ తేదీ వరకు తుఫానుగా మారే అవకాశం ఉంది. వాయువత్య దిశగా ప్రయాణించి 26న ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కింది స్థాయి గాలులు రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది.