న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థ రికవరీ దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం, విస్తరణపై ఆధారపడిఉందని ఆర్బీఐ పేర్కొంది. వ్యాక్సినేషన్ వేగవంతమయ్యే తీరే రాబోయే కాలంలో రికవరీని నిర్ధేశిస్తుందని ఆర్బీఐ బుధవారం విడుదల చేసిన నెలవారీ నివేదికలో తెలిపింది. మహమ్మారి నుంచి బయటపడి ముందుకువెళ్లే సత్తా మన ఆర్థిక వ్యవస్థలో దాగుందని పేర్కొంది.
ఆశావహ ధోరణి తిరిగివచ్చినా మహమ్మారి ప్రభావాలను తట్టుకుంటూ సాగాల్సి ఉందని నివేదిక తెలిపింది. ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తే..సెకండ్ వేవ్ ప్రధానంగా దేశీయ డిమాండ్ ను దెబ్బతీసిందని పేర్కొంది. సానుకూల పరిణామాల విషయానికి వస్తే వ్యవసాయ దిగుబడుల సరఫరాలు, సేవల రంగం మెరుగ్గా ఉన్నాయని, గత ఏడాదితో పోలిస్తే ఎగుమతులు పెరిగాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది.