సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): అన్నపూర్ణ భోజనాన్ని ఇక ప్రభుత్వం ఉచితంగా అందించనున్నది. కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవడంతో హైదరాబాద్లోని నిరాశ్రయులు, చిరు వ్యాపారులకు అన్నపూర్ణ సెంటర్ల ద్వారా ఐదు రూపాయల భోజనం అందిస్తున్న విషయం విదితమే. అయితే ఇక ఈ భోజనాన్ని ఉచితంగా అందివ్వాలని మంత్రి కేటీఆర్ ఆదేశించిన నేపథ్యంలో మంగళవారం 250 సెంటర్ల ద్వారా ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేశారు. ప్రతిరోజు ఈ సెంటర్ల ద్వారా 45 వేల మందికి భోజనాలు అందుతుండటం గమనార్హం.
లాక్డౌన్ వల్ల అనేక అవస్థలు పడుతున్న ఇతర రాష్ట్ర కార్మికులు, చిరు ఉద్యోగులు, రోజువారీ కూలీలు, నిరాశ్రయులు, వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులకు అన్నపూర్ణ ద్వారా ప్రభుత్వం ఆహారం అందిస్తున్నది. ప్రధాన వైద్యశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కూలీల అడ్డాలు, ప్రముఖ జంక్షన్లలో ఈ కేంద్రాలు నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ప్లేట్ భోజనంలో 450 గ్రాముల అన్నం, 100 గ్రాముల పప్పు, సాంబారు, పచ్చడి తప్పనిసరిగా ఉండేలా మెనూ అమలు చేస్తున్నాయి. పోషకాహారాన్ని అందిస్తున్న అన్నపూర్ణ కేంద్రాల సేవలను వలస కార్మికులు, నిరాశ్రయులు, విద్యార్థులు, ఉద్యోగులు కొనియాడుతున్నారు. మరోవైపు ఉచితంగా అందజేయాలన్న మంత్రి కేటీఆర్ నిర్ణయంపై మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.