వాషింగ్టన్, అక్టోబర్ 12: భారత ఆర్థిక వృద్ధిరేటు ఈ ఏడాది 9.5 శాతంగా నమోదు కావచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అయితే వచ్చే ఏడా ది 8.5 శాతంగానే ఉండొచ్చన్నది. మంగళవారం వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్ తాజా గణాంకాలను ఐఎంఎఫ్ విడుదల చేసింది. ఈ సందర్భంగా భారత జీడీపీ అంచనాలను ప్రకటించింది. కరోనా కారణంగా గతేడాది దేశ వృద్ధిరేటు ఏకంగా మైనస్లోకి పడిపోయిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది ప్రపంచ జీడీపీ 5.9 శాతంగా, వచ్చే ఏడాది 4.9 శాతంగా నమోదు కావచ్చని ఐఎంఎఫ్ పేర్కొన్నది. అమెరికా 6 శాతం, చైనా 8 శాతం చొప్పున ఈ ఏడాది వృద్ధిరేటును అందుకోవచ్చని, కానీ 2022లో ఇవి 5.2 శాతం, 5.6 శాతానికి తగ్గిపోవచ్చన్నది.