ముంబై, ఆగస్టు 6: కరోనా ప్రభావం నేపథ్యంలో మరోసారి రిజర్వ్ బ్యాంక్ తమ ద్రవ్యసమీక్షలో వృద్ధిరేటుకే ప్రాధాన్యతనిచ్చింది. రెపో, రివర్స్ రెపోల జోలికి ఈసారీ వెళ్లలేదు. రెపో రేటును 4 శాతంగా, రివర్స్ రెపోను 3.35 శాతంగానే ఉంచుతున్నట్లు శుక్రవారం సమీక్ష అనంతరం గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఇందుకు ద్రవ్యవిధాన కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కాగా, ఇలా యథాతథంగా ఉంచడం ఇది వరుసగా ఏడోసారి. చివరిసారిగా గతేడాది మే 22న సవరించారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాను 5.7 శాతానికి పెంచారు. క్రిందటిసారి సమీక్షలో ఇది 5.1 శాతంగానే ఉండటం గమనార్హం. జీడీపీ అంచనాలో మాత్రం మార్పు లేదు. 9.5 శాతంగానే నమోదు కావచ్చన్నారు.
రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు తగ్గించామని, ఈ క్రమంలో బ్యాంకర్లు సైతం రుణగ్రహీతలకు ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నారని దాస్ ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. కొత్త రుణాలపై 217 బేసిస్ పాయింట్లు, పాత రుణాలపై 170 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లు తగ్గాయన్నారు. ఈ పరిణామం దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడగలదన్నారు. ఇదిలావుంటే రెట్రో ట్యాక్స్ ఎత్తివేతను స్వాగతించారు. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మాస్టర్ కార్డ్పై చర్యలు నిబంధనల అమలు కోసమేనని స్పష్టం చేశారు.
ఈ ఏడాది ఆఖరుకల్లా డిజిటల్ కరెన్సీ విధానం రావచ్చని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవి శంకర్ సంకేతాలిచ్చారు. గత నెల్లోనూ డిజిటల్ కరెన్సీని దశలవారీగా అమల్లోకి తెచ్చేందుకు ఆర్బీఐ కృషి చేస్తున్నదని, ఇందుకు సాంకేతికంగా ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నదని శంకర్ చెప్పిన విషయం తెలిసిందే. చైనాసహా చాలా దేశాలు ఇప్పటికే డిజిటల్ కరెన్సీని ట్రయల్ రన్ చేస్తున్నట్లు గుర్తుచేశారు. ఈ క్రమంలో డిసెంబర్ నాటికి ఆర్బీఐ నుంచి ఓ డిజిటల్ కరెన్సీ పరిచయమయ్యే వీలుందన్నారు. దాస్ నుంచి కూడా ఇదే తరహా సమాధానం వస్తున్నది.
కరోనా ప్రభావం నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆర్బీఐ కొనసాగిస్తున్న తీరును స్వాగతిస్తు న్నాం. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం పరిశ్రమకు లాభిస్తుంది. -పీహెచ్డీసీసీఐ
ఆర్బీఐ పాలసీ జీడీపీ వృద్ధికి ప్రాధాన్యతనిచ్చింది. ద్రవ్యోల్బణంపై ఆందోళనలున్నా.. రెపో రేటు జోలికి వెళ్లలేదు. ఈసారి పంట దిగుబడులు పెరిగి ఆహార ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నాం. -అసోచామ్
ఈసారీ ద్రవ్యసమీక్ష వృద్ధిరేటుకు పెద్దపీట వేసింది. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో పరిశ్రమకు దన్నుగా రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలుండటం హర్షణీయం. మున్ముందూ ఇదే ధోరణీ ఉండాలని కోరుకుంటున్నాం. -ఫిక్కీ