న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల కోసం డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను చాలా మంది ఇస్తుంటారు. వీటిని పదే పదే ఎంటర్ చేయడం ఎందుకని.. ఒకేసారి ఆయా సైట్లలో సేవ్ చేసి పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల తర్వాతి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కేవలం సీవీవీ ( CVV ) ఎంటర్ చేస్తే చాలు. కానీ ఆర్బీఐ ( RBI ) కొత్త తీసుకొస్తున్న రూల్ దీనికి చెక్ పెట్టనుంది. ఇకపై మీరు ఆన్లైన్లో చేసే ప్రతి ట్రాన్సాక్షన్కు మొత్తం కార్డు వివరాలు.. అంటే 16 అంకెల కార్డు నంబర్, సీవీవీ, మీ పేరు, కార్డు ఎక్స్పైరీ డేటు నమోదు చేయాల్సి ఉంటుంది.
అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం, గూగుల్ పేలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూజర్ల డేటాను స్టోర్ చేయకూడదన్న ఉద్దేశంతో ఈ కొత్త రూల్ను ప్రవేశపెడుతున్నారు. 2022, జనవరి నుంచి దీనిని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతిసారీ కార్డు వివరాలు నమోదు చేయడం అంత సులువు కాదు కానీ.. దీని వల్ల యూజర్ల వివరాలు సురక్షితంగా ఉంటాయన్నది ఆర్బీఐ వాదన. ప్రస్తుతానికి ఈ-కామర్స్ సైట్లు, పేమెంట్ గేట్వేలు తమ సర్వర్లలో యూజర్ల డేటాను స్టోర్ చేసి అవసరమైనప్పుడు అందిస్తున్నాయి. ట్రాన్సాక్షన్ సమయంలో కేవలం సీవీవీ, ఓటీపీతో యూజర్ల పని చాలా వరకూ తగ్గిపోతోంది.