ముంబై, జూన్ 5: బ్యాంకింగ్ ఖాతాదారుల సేవల్ని మెరుగుపర్చేందుకు రిజర్వ్బ్యాంక్ కమిటీ సోమవారం కీలకమైన సిఫార్సులు చేసింది. కేవైసీ అప్డేట్, మృతిచెందినవారి వారసుల సెటిల్మెంట్ క్లెయింలు, పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణలో వెసులుబాటు కల్పించడం వంటివి ఈ సూచనల్లో ఉన్నాయి. ఆర్బీఐ నియంత్రణలో ఉన్న సంస్థల (ఆర్ఈలు-బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు) ఖాతాదారుల సేవల ప్రమాణాల్ని సమీక్షించేందుకు ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో నేతృత్వంలో గత ఏడాది మే నెలలో కేంద్ర బ్యాంక్ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్ఈల ఇంటర్నల్ గ్రీవియెన్స్ రిడ్రెస్ (ఐజీఆర్)లో గత మూడేండ్లలో నమోదైన ఫిర్యాదుల్ని కమిటీ సమీక్షించింది.