ముంబై : వెనకటి తేదీ నుంచి విధించే పన్ను (రెట్రో ట్యాక్స్) నోటీసులను ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం స్వాగతించారు. ఇది సకాలంలో తీసుకున్న నిర్ణయమని ప్రశంసించారు. కరోనా మహమ్మారితో తలెత్తిన సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కూడా ఆయన సమర్ధించారు.
రెట్రో ట్యాక్స్ను తొలగించాలనే డిమాండ్ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న అంశమని ఇది తాను రెవిన్యూ కార్యదర్శిగా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా వ్యవహరించినప్పటి నుంచి వినిపిస్తున్న వ్యవహారమని శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. ఈ దిశగా తీసుకున్న నిర్ణయం సరైన చర్యని ఆయన స్వాగతించారు. ఇక ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా కీలక రేట్లను ఆర్బీఐ మరోసారి యథాతథంగా ఉంచింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా రికవరీకి ఊతమివ్వడంతో పాటు ఆర్ధిక వ్యవస్ధలో స్ధిరత్వం కోసం వడ్డీరేట్లలో మార్పులకు కేంద్ర బ్యాంక్ మొగ్గుచూపలేదు.