‘ఈ సినిమా కథ విన్నప్పుడే అంగీకరించడం బాధ్యత అనిపించింది. ప్రస్తుతం పంట పండించే రైతులు తక్కువైపోతున్నారు, తినేవాళ్లు పెరిగిపోతున్నారు. ఈ కాన్సెప్ట్ మీద దర్శకుడు కిషోర్ అద్భుతమైన కథ రాసుకున్నాడు’ అని అన్నారు శర్వానంద్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిషోర్ బి దర్శకుడు. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. ఈ నెల 11న విడుదలకానుంది. శనివారం ట్రైలర్ను నితిన్, నాని, వరుణ్తేజ్ ఆవిష్కరించారు. శర్వానంద్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నా. ట్రైలర్ చూడగానే నా మిత్రుడు రామ్చరణ్ ఫోన్ చేసి ‘మంచి పాయింట్ చెబుతున్నారు. సినిమాకు నేను సపోర్ట్ చేస్తా’ అన్నాడు. చిరంజీవిగారికి 9 నిమిషాల వీడియో కట్ చూపించాం. ఆయన బాగా ఇంప్రెస్ అయ్యారు.
8వ తేదిన ఖమ్మంలో జరిగే ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొనడానికి ఒప్పుకొన్నారు. మంత్రి కేటీఆర్గారికి ఫోన్ చేసి ఈ సినిమా కథ గురించి వివరించాం. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. 9వ తేదీన హైదరాబాద్లో జరిగే ఈవెంట్కు హాజరవుతానన్నారు’ అని పేర్కొన్నారు నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ ‘ఇదొక యువరైతు కథ. గ్రామీణ వాతావరణంలో బలమైన భావోద్వేగాల్ని స్పృశిస్తూ సాగుతుంది’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మనందరం వ్యవసాయ కుటుంబాల్లోంచి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. ఇది మనందరి కథ..మన ఊరి కథ అనే భావన కలుగుతుంది’ అన్నారు. వ్యవసాయం ఔన్నత్యాన్ని తెలియజెప్పే గొప్ప కథ ఇదని రచయిత సాయిమాధవ్ బుర్రా చెప్పారు.