న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలే లక్ష్యంగా ప్లేయర్లను తీర్చిదిద్దేందుకు అన్ని రకాల హంగులతో క్రీడా విశ్వవిద్యాలయం రాబోతున్నది. దేశంలోనే తొలి యూనివర్సిటీకి మన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి వైస్ చాన్స్లర్గా నియమితురాలైంది. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను బుధవారం మల్లీశ్వరి మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా మల్లీశ్వరి ఎంపికపై కేజ్రీవాల్ ట్విట్టర్లో స్పందించారు. ‘ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభంతో మా కల నిజం కాబోతున్నది. ఒలింపిక్ పతక విజేత మల్లీశ్వరిని విశ్వవిద్యాలయానికి మొదటి వీసీగా నియమించడం చాలా గర్వంగా ఉంది. భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించాం’ అని ట్వీట్ చేశారు. మరోవైపు వీసీగా ఎంపికైన మల్లీశ్వరికి తెలంగాణ సాంస్కృతిక శాఖ సలహాదారు కేవీ రమణాచారి శుభాకాంక్షలు తెలిపారు.