న్యూఢిల్లీ: కొత్తగా 12 క్లస్టర్లలో 151 ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే బిడ్లను ఆహ్వానించింది. ఈ సంగతి కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శుక్రవారం సభ్యులు రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో ఈ రైళ్లు నడుపుతామని అన్నారు.
సీట్ల కొరత వల్ల సుమారు 5 కోట్ల మంది వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు 2019-20లో తమ ప్రయాణాన్ని ఉపసంహరించుకున్నారని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ లోటును పూడ్చడానికి ఇండియన్ రైల్వేస్ వందే భారత్, తేజాస్, ఎల్హెచ్బీ, విస్టాడోమ్ తరహా కోచ్ల తయారీని పెంచేసిందన్నారు.
ఇప్పుడు నడుస్తున్న ప్రయాణికుల రైళ్ల సర్వీసులపై పీపీపీ రైలు సర్వీసులు ప్రభావం చూపబోవని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పీపీపీ రైళ్లు అదనపు సేవలందిస్తాయన్నారు. ట్రాక్, సిగ్నలింగ్, ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ (ఓహెచ్ఈ), స్టేషన్లు తదితర భారతీయ రైల్వే వసతులను పీపీపీ రైళ్లు వాడుకుంటాయని చెప్పారు.
పీపీపీ రైళ్ల ఆపరేషన్ల కోసం డ్రైవర్లు, గార్డులను పీపీపీ కింద భారతీయ రైల్వే వారికి సరఫరా చేస్తుందన్నారు. ప్యాసింజర్ రైళ్ల ప్రాజెక్టులో రైల్వే ఉద్యోగి కీలకమైన పాత్ర పోషిస్తారని అశ్విని వైష్ణవ్ తెలిపారు.