న్యూఢిల్లీ, అక్టోబర్ 13: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ).. పసిడి తాకట్టు రుణాలపై వడ్డీరేట్లను భారీగా తగ్గించింది. బంగారు ఆభరణాలు, సావరిన్ గోల్డ్ బాండ్ల(ఎస్జీబీ)పై వడ్డీరేటును 145 బేసిస్ పాయింట్లు లేదా 1.45 శాతం తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. బ్యాంక్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో సావరిన్ గోల్డ్ బాండ్లపై వడ్డీరేటు 7.20 శాతానికి దిగిరానుండగా, అలాగే పసిడి ఆభరణాలపై వడ్డీ 7.30 శాతానికి తగ్గనున్నది. దీంతోపాటు గృహ రుణాలపై వడ్డీరేటును కూడా 6.60 శాతం ప్రారంభ వడ్డీని ఆఫర్చేస్తున్నది. అలాగే 7.15 శాతం ప్రారంభ వడ్డీతో వాహన రుణాలను ఆఫర్ చేస్తున్న బ్యాంక్.. 8.95 శాతం వడ్డీకే వ్యక్తిగత రుణాలను ఇస్తున్నది. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో అతి తక్కువ వడ్డీల్లో ఇది కూడా ఒకటని బ్యాంక్ పేర్కొంది. ఈ పండుగ సీజన్ సందర్భంగా బంగారు రుణాలు, ఎస్జీబీ, గృహ, వాహన రుణాలపై సర్వీసు చార్జీ, ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేస్తున్నట్లు పీఎన్బీ ప్రకటించింది.