మంచాల, జూన్27: పల్లెప్రగతితో అస్మత్పూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. ఎన్నో ఏండ్లుగా జాపాల పంచాయతీకి అనుబంధ గ్రామంగా ఉన్న అస్మత్పూర్ను ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటుచేసింది. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు ఎమ్మెల్యే కిషన్రెడ్డి సహకారంతో అస్మత్పూర్ను సమస్యలు లేని గ్రామంగా సర్పంచ్ నౌసు హరిప్రసాద్ తీర్చిదిద్దుతున్నాడు. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామం నేడు పల్లె ప్రగతితో రూపురేఖలు మారాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.50 లక్షల నిధులతో గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయి. గతంలో గ్రామంలో ఎక్కడ చూసినా మురుగు కాల్వలు, గుంతల రోడ్లు, ఊరు పక్కనే పెంటకుప్పలు ఉండడంతో ఈగలు, దోమలతో స్థానికులు అనారోగ్యం బారిన పడేవారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో పరిసరా లన్నీ పరిశుభ్రంగా మారాయి. సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, ప్రజల సహకారంతో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం గ్రామంలో సీసీరోడ్లు, భూగర్భడ్రైనేజీలు, హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమం, వర్మీ కంపోస్టుయార్డు, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం నిర్మించారు. ప్రతిరోజూ పంచాయతీ ట్రాక్టర్తో తడి, పొడి చెత్తను సేకరించి, కంపోస్టుయార్డుకు తరలించడం, పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా మొక్క లు కనువిందు చేస్తున్నాయి.
రూ.12.60 లక్షలతో వైకుంఠధామం
అస్మత్పూర్ గ్రామంలో రూ.12.60లక్షలతో వైకుంఠధామం నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. ఇందులో స్నానాల గదులతో పాటు ఇతర సదుపాయాలు కల్పించారు.
కంపోస్టు యార్డుకు రూ.2 లక్షలు
గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారు చేయడం కోసం రూ.2 లక్షలతో కంపోస్టు యార్డు నిర్మించారు. గ్రామంలో ప్రతిరోజూ తడి, పొడి చెత్తను పంచాయతీ ట్రాక్టర్తో సేకరించి ఎరువు తయారీకి ఉపయోగిస్తున్నారు. ఈ ఎ రువును హరితహారం మొక్కల కు వేస్తున్నారు.
ట్రాక్టర్కు రూ.8లక్షలు
గ్రామంలో చెత్త సేకరణతోపాటు హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోయడం కోసం పంచాయతీ నిధుల నుం చి రూ.8లక్షలతో ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. ట్రాక్టర్ ద్వారా ప్రతి రోజు గ్రామంలో చెత్త సేకరించి, కంపోస్టుయార్డుకు తరలిస్తున్నారు.
రూ.2లక్షలతో పల్లెప్రకృతి వనం
అస్మత్పూర్ పంచాయతీ అనుబంధ గ్రామమైన చాంద్ఖాన్గూడలోని ఎకరం పొలంలో రూ.2లక్షలతో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటుచేశారు. ఇందులో వివిధ రకాల పండ్లు, పూలమొక్కలు పెంచుతున్నారు. వన నర్సరీలో వివిద రకాల 8వేల మొక్కలు పెంచుతున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మొక్కలకు నీరు పోసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు.
ఎమ్మెల్యే సహకారంతో గ్రామాభివృద్ధి
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. రెండేండ్ల కాలంలో రూ.50లక్షల నిధులతో అభివృద్ధి పనులను పూర్తి చేసుకుంటున్నాం. గ్రామంతో పాటు అనుబంధ గ్రామం చాంద్ఖాన్గూడలోని ప్రతి వార్డులో సీసీరోడ్డు, భూగర్భ డ్రైనేజీ, వీధి దీపాలు, మిషన్ భగీరథ ఇంటింటీకీ నల్లా నీటిని అందజేస్తున్నాం.
– నౌసు హరిప్రసాద్, సర్పంచ్, అస్మత్పూర్
పల్లె ప్రగతితో గ్రామం మారింది
పల్లె ప్రగతితో గ్రామం రూపురేఖలు మారాయి. వైకుంఠధామం, డంపింగ్యార్డు, మురుగు కాల్వ లు, సీసీరోడ్లను నిర్మించాం. గ్రామంలో వీధిదీపాల నిర్వహణ, పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ, ప్రతిరోజు మిషన్ భగీరథ నీటి సరఫరాతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమైంది. – నాగప్ప, పంచాయతీ కార్యదర్శి