హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): శరీరంలో జ్వర తీవ్రతను చూసుకోవడానికి థర్మామీటర్ ఉన్నట్టే.. శరీరంలో ఆక్సిజన్ స్థాయిని గుర్తించి అప్రమత్తంగా ఉండేందుకు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇండ్లల్లో ఆక్సిమీటర్ కూడా ఉంటున్నది. కరోనా తీవ్ర రూపం దాలుస్తుండటంతో ప్రజలు ఆక్సిమీటర్లను కొనుగోలుచేస్తున్నారు. వీటికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో మెడికల్ షాపు నిర్వాహకులు వీటిని అధిక ధరకు విక్రయిస్తున్నారు. గతేడాది కరోనా రాకముందు మార్కెట్లో దీని ధర కంపెనీని బట్టి రూ.900లనుంచి ప్రారంభమయ్యేది. ప్రస్తుతం వైరస్ తీవ్రమైన నేపథ్యంలో రూ.1,600- రూ.2,500 వరకు విక్రయిస్తున్నారు. మెడికల్ డిస్ట్రిబ్యూటర్లను సంప్రదిస్తే తాము తాజా రిటైల్ మార్కెట్లకు సరఫరాచేస్తున్న ధర రూ.1,300- రూ.1,600 దాకా ఉంటున్నదని, రిటైల్లో మాత్రం రూ.2,500 వరకు విక్రయిస్తున్నామని ఓ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. ఆక్సిమీటర్లు మార్కెట్లో సరిపడా ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని డిస్ట్రిబ్యూటర్లు పేర్కొంటున్నారు. సెకండ్ వేవ్లో చాలా వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఒక రకమైన భయాందోళన నెలకొన్నది. ఇంట్లో థర్మామీటర్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లతోపాటు పల్స్ ఆక్సిమీటర్ను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ మార్కెట్ వ్యాపారులు ఆక్సిమీటర్ల కొరత ఉందంటూ వాటి ధరలను పెంచి విక్రయిస్తున్నారు. మెడికల్ షాపునకు వెళ్లి అడిగిన వెంటనే ఇవ్వకుండా.. ప్రస్తుతం స్టాక్ లేదని, కావాలంటే త్వరగా తెప్పించి ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని, ధర మాత్రం ఎక్కువగా ఉన్నదని సమాధానం ఇస్తున్నారు.