పోలీస్స్టేషన్లో రిసెప్షన్ వ్యవస్థ కీలకమైంది.. ఎవరైనా బాధితులు స్టేషన్కు రాగానే.. ముందుగా వాళ్లకు కొన్ని మంచినీళ్లు ఇచ్చి.. అప్యాయతతో పలకరిస్తాం.. వాళ్లకు మేమున్నామనే భరోసా కల్పిస్తాం.. జరిగిన విషయం తెలుసుకొని..ఫిర్యాదు రాసేవారైతే అన్ని అంశాలు ఉండే విధంగా రాయాలని సూచిస్తాం.. రాయలేని వారికి మేమే ఫిర్యాదు రాయడంలో సహాయపడుతాం.. ఫిర్యాదుతో పాటు ఫిర్యాదుదారుడిని ఎస్హెచ్ఓకు దగ్గరకు తీసుకెళ్లి.. జరిగిన విషయం చెబుతాం.. ఇన్స్పెక్టర్ ఆ ఫిర్యాదును విచారణ కోసం ఒక అధికారికి అప్పగిస్తారు.. విచారణ అధికారి ఘటనా స్థలానికి వెళ్లి… వాస్తవాలు పరిశీలించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటారు.. అంటూ హోంమంత్రి మహమూద్ అలీకి ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్లో రిసెప్షన్ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ అనిత వివరించింది.. ఆమె రిసెప్షన్ వ్యవస్థ గురించి చెప్పిన విధానానికి అక్కడున్న హోంమంత్రితోపాటు మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు ఆశ్చర్యానికిలోనయ్యారు.
బుధవారం ఎస్ఆర్నగర్ ఠాణా నూతన భవనం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ.. రిసెప్షన్ విధులు నిర్వహిస్తున్న అనితను రిసెప్షన్ పనితీరు గురించి అడుగగా.. ఆమె ఆ వ్యవస్థ గురించి స్పష్టంగా వివరించింది.. రిసెప్షన్ వ్యవస్థ పనితీరు, దాని ముఖ్య ఉద్దేశ్యాన్ని ఆమె వివరించిన తీరును అక్కడున్న మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. సీపీ అంజనీకుమార్ ఆమెను కమిషనరేట్ కార్యాలయానికి పిలిపించి… మెమోంటో అందించి అభినందించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. 17 వర్టికల్స్గా పోలీస్స్టేషన్లో పనుల విభజన చేసి, ఒక్కో వర్టికల్కు ఒక్కో అధికారి బాధ్యత తీసుకొని జవాబుదారితనంతో పనిచేస్తున్నారన్నారు. అయితే ప్రతి పోలీస్స్టేషన్లో నలుగురు మహిళా కానిస్టేబుళ్లు రిసెప్షన్ వ్యవస్థలో పనిచేస్తున్నారని.. కీలకమైన ఈ వ్యవస్థలో పనిచేస్తున్న అనిత బాధితులకు న్యాయం చేస్తూ, పోలీసులకు మరింత పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నదని సీపీ కొనియాడారు. బాధితులు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదవుతుందని.. ఆయా కేసుల్లో ఇదే కీలకంగా ఉంటుందని, ఫిర్యాదు రిసెప్షన్ వద్దనే తీసుకోవడంతో ఈ వ్యవస్థ చాలా కీలకమైందని సీపీ తెలిపారు.