హైదరాబాద్, అక్టోబర్ 21: దేశంలో అతిపెద్ద సీపాస్ ప్రొవైడర్ తాన్లా ప్లాట్ఫామ్…హైదరాబాద్లో ఇన్నోవేషన్, ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. 92 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రహేజా పార్క్లో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్ వచ్చే నాలుగు నెలల్లో అందుబాటులోకి రానున్నది. టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ సెంటర్ను తీర్చిదిద్దుతున్నట్లు, ముఖ్యంగా బ్లాక్ చెయిన్, కృత్రిమ మేధస్సు, మిషన్ లెర్నింగ్లో అడ్వాన్స్ టెక్నాలజీని అందించడమే లక్ష్యంగా ఈ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తాన్లా ఫౌండర్, చైర్మన్, సీఈవో ఉదయ్ రెడ్డి తెలిపారు. ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ కోసం రూ.70 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సెంటర్తో కొత్తగా 300 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. దీంతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 1,000కి చేరుకోనున్నది. 800 మంది సిబ్బంది కూర్చోవడానికి వీలుండే ఈ సెంటర్లో ప్రస్తుతం 300 మందిని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నట్లు, దశలవారీగా ఈ సంఖ్యను పెంచనున్నట్లు ప్రకటించారు. మరోవైపు భారత్తోపాటు మధ్య ప్రాచ్యం, ఫిలిప్పీన్స్, యూరప్ దేశాలకు వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉందన్నారు. కరోనాతో ఇంచుమించు అన్ని రంగాలు కుదేలైనప్పటికీ టెక్నాలజీ రంగానికి ప్రయోజనం జరిగిందని, ముఖ్యంగా టెక్నాలజీ వాడకం మరింత పెరిగిందని చెప్పారు.
క్యూ2లో 67% పెరిగిన లాభం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది తాన్లా. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.136 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.81 కోట్లతో పోలిస్తే 67 శాతం పెరిగినట్లు ఉదయ్ రెడ్డి వెల్లడించారు. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 44 శాతం ఎగబాకి రూ.841.60 కోట్లకు చేరుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.1,468 కోట్ల ఆదాయంపై రూ.240 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకున్నది.