హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ)/తెలుగు యూనివర్సిటీ: కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉన్నదని, లాక్డౌన్, కర్ఫ్యూలు ఉండవని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. ప్రస్తుతం రోజుకు 60 వేలకు పైగా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, భవిష్యత్లో 1.5 లక్షల పరీక్షలు చేసేందుకు సిద్ధమని చెప్పారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 60శాతం మహారాష్ట్రలోనే ఉన్నాయని, సరిహద్దు రాష్ర్టాల నుంచే తెలంగాణకు వైరస్ వ్యాప్తి చెందుతున్నదని వివరించారు. సరిహద్దుల్లో అక్కడిక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నామని, టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ను పకడ్బందీగా చేస్తున్నట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఉన్న ప్రధాన, ఏరియా దవాఖానల్లో ఏర్పాట్లపై బుధవారం కోఠి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ‘ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించాలి’ అనే అంశంపై ఫ్యాప్సీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. అన్ని దవాఖానల్లో సాధారణ సేవలు కొనసాగిస్తూనే కరోనాకు చికిత్స అందిస్తున్నామని అన్నారు.
వైద్యారోగ్యశాఖ సిబ్బందికి సెలవులు లేకుండా 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించామని చెప్పారు. ప్రస్తుతం 11 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ప్రభుత్వ దవాఖానలకు వెళ్లాలని సూచించారు. ప్రైవేట్ దవాఖానలు సైతం వ్యాపార కోణాన్ని మానుకోవాలని సూచించారు. హోంఐసొలేషన్లో ఉన్నవారికి కిట్స్ అందిస్తామని, పీహెచ్సీస్థాయిలో డాక్టర్లు ఇంటికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటారని చెప్పారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో ఫ్యాప్సీ అధ్యక్షుడు రమాకాంత్ ఇమానీ, ఉపాధ్యక్షుడు భాస్కర్రెడ్డి, అనిల్ అగర్వాల్, హెల్త్కేర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ పూర్వ అధ్యక్షుడు శేఖర్అగర్వాల్, సీఈవో క్యాతీ నర్వానీ, ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ వర్షిణి, అపోలోగ్రూప్ అధ్యక్షుడు డాక్టర్ కే హరిప్రసాద్, సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్మిశ్రా తదితరులు పాల్గొని ప్రసంగించారు.
కరోనా కట్టడికి చర్యలు: మంత్రి మల్లారెడ్డి
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కార్మికుల రక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు. బుధవారం ఈఎస్ఐ ప్రాంతీయ బోర్డుసమావేశంలో ఆయన మాట్లాడారు. పడకలు సిద్ధంగా ఉంచాలని సనత్నగర్ డీన్, నాచారం సూపరింటెండెంట్ను ఆదేశించారు. నాచారం, రామచంద్రాపురం దవాఖానల పనుల పురోగతిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సమీక్షలో ఉన్నతాధికారులు రాణికుముదిని, ఆర్డీ శర్మ, బోర్డు సభ్యులు మల్లేశం, కేవీ రమణారెడ్డి, ఏ రవిశంకర్, వేముల మారయ్య, టీ రాజమహేందర్, సత్యం, ఈఈ రవికుమార్, ఎస్ఎంవో డాక్టర్ ప్రదీప్, ఈఎస్ఐ డీన్ శ్రీనివాస్, నాచారం, రామచంద్రాపురం సూపరింటెండెంట్లు డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు.