హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): బ్యాంకు రుణం ఎగవేత, మనీలాండరింగ్ కేసులో పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ఎండీ ఉప్పలపాటి సతీశ్ను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్)అరెస్టు చేసింది. ఇదే కేసులో ఇప్పటికే సతీశ్ సోదరి, వీఎంసీఎస్ఎల్ డైరెక్టర్ వి. హిమబిందును సైతం ఈడీ అధికారులు గత వారంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ బ్యాంకుల కాన్సార్షియమ్కు రూ. 3316 కోట్ల రుణాల్ని ఎగవేయడంతోపాటు మనీలాండరింగ్కు పాల్పడిన ఆరోపణలపై టెలికాం పరికరాల తయారీ సంస్థ వీఎంసీఎస్ఎల్పై సీబీఐ అధికారులు ఫోర్జరీ, మోసం తదితర సెక్షన్ల కింద 2018లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించగా వీఎంసీఎస్ఎల్ కంపెనీ… పీఐఎస్ఎల్(పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ లిమిటెడ్)కి రూ.692 కోట్లకు నకిలీ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ను ఇచ్చినట్టుగా పత్రాలు సృష్టించినట్టు దర్యాప్తులో తేలింది.
వీఎంసీఎస్ఎల్ డైరెక్టర్ హిమబిందు తన సోదరుడు, పీఐఎస్ఎల్ ఎండీ సతీశ్కు చెందిన ఖాతాల్లోకి డబ్బులు మళ్లించినట్టు ఈడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. వాటి ఆధారంగా సతీశ్ను అరెస్టు చేశారు. సతీశ్కు న్యాయస్థానం పది రోజుల ఈడీ కస్టడీ విధించింది. కేసు దర్యాప్తులో ఉన్నట్టు అధికారులు తెలిపారు.