మొబైల్ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ సేవలపై టెలికం శాఖ
న్యూఢిల్లీ, మే 24: మొబైల్ ఫోన్ వినియోగదారులు త్వరలో తమ సిమ్ కార్డును మార్చకుండానే కేవలం ఓటీపీ ద్వారా పోస్ట్పెయిడ్ నుంచి ప్రీపెయిడ్కు, ప్రీపెయిడ్ నుంచి పోస్ట్పెయిడ్కు రావచ్చని టెలికం శాఖ ఏడీజీ సురేశ్ కుమార్ తెలిపారు. ఈ ప్రతిపాదనను టెలికం శాఖకు భారతీయ సెల్యులార్ ఆపరేటర్ల సంఘం పంపిందని చెప్పారు. అయితే దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని తిరిగి టెలికం ఆపరేటర్లకే టెలికం శాఖ సూచించింది. దీంతో తదనంతర ఫలితాలపైనే నిర్ణయం ఉంటుందని ఇటీవలి ఓ ప్రకటనలో సురేశ్ కుమార్ చెప్పారు.
5జీకి సిద్ధం: ఎయిర్టెల్
దేశంలో 5జీ హైస్పీడ్ డాటా సేవల ప్రారంభానికి తాము పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని భారతీ ఎయిర్టెల్ సోమవారం ప్రకటించింది. నెట్వర్క్ క్వాలిటీ పెంచేందుకు కర్నాటక, తమిళనాడుల్లో అదనపు స్పెక్ట్రంనూ సమకూర్చుకున్నట్లు చెప్పింది.
3 ట్రిలియన్ డాలర్లకు మార్కెట్క్యాప్
ముంబై, మే 25: బీఎస్ఈలో లిస్టయిన కంపెనీలన్నింటి మార్కెట్ విలువ తొలిసారిగా సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్లో 3 ట్రిలియన్ డాలర్ల మార్క్ను చేరింది. ఈ విశేషాన్ని బీఎస్ఈ ఇండియా సీఈఓ అశీష్కుమార్ చౌహాన్ ట్వీట్ చేస్తూ 6.9 కోట్ల మంది రిజిష్టర్డ్ ఇన్వెస్టర్లు, 1400మంది బ్రోకర్లు, 69,000 మంది మ్యూచువల్ డిస్ట్రిబ్యూటర్లు, 4700 కంపెనీలకు శుభాభినందనలు తెలిపారు.
సెన్సెక్స్ 111 పాయింట్లు అప్
గత శుక్రవారం పెద్ద ర్యాలీ జరిపిన బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం మరో 111 పాయింట్లు పెరిగి 50,652 పాయింట్ల వద్ద ముగిసింది.