న్యూఢిల్లీ, జూలై 27: సౌర పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్.. హైదరాబాద్లో నెలకొల్పిన కొత్త ప్లాంటును ఈ నెల 29న ప్రారంభించనున్నది. తెలంగాణ ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు చేతుల మీదుగా గురువారం ప్రారంభం కానున్న ఈ కొత్త ప్లాంటును రూ.483 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసినట్టు ప్రీమియర్ ఎనర్జీస్ మంగళవారం తెలిపింది. కాగా, ఈ అత్యాధునిక ప్లాంటుతో దేశంలో ఐదు పెద్ద సౌర విద్యుత్తు పరికరాల తయారీ కంపెనీల్లో ఒకటిగా ప్రీమియర్ ఎనర్జీస్ ఆవిర్భవిస్తుంది.
ఈ ప్లాంటు 750 మెగావాట్ల సోలార్ సెల్స్, 750 మెగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్లాంటులో ఎంసీసీఈ టెక్చర్డ్ మల్టీ-క్రిస్టల్లీన్ సెల్స్, మాడ్యూల్స్, మోనో పీఈఆర్సీ సెల్స్, మాడ్యూల్స్, పాలీక్రిస్టల్లీన్ సెల్స్, మాడ్యూల్స్ ఉత్పత్తవుతాయి. రూ. 1,200 కోట్ల పెట్టుబడులతో వచ్చే రెండేండ్లలో తమ సౌర విద్యుత్తు ఉపకరణాల వార్షిక ఉత్పాదక సామర్థ్యాన్ని 3 గిగావాట్లకు విస్తరించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సలూజా వెల్లడించారు. వచ్చే నాలుగు నెలల్లోనే రూ. 500 కోట్ల పెట్టుబడితో ఒక గిగావాట్ సామర్థ్యాన్ని పెంచుతామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 500 కోట్లు పెట్టుబడి పెడుతామని ఆయన వివరించారు. మొత్తంమీద వచ్చే రెండేండ్లలో రూ.1,000-1,200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియర్ ఎనర్జీస్ ప్రస్తుతం దాదాపు 1 గిగావాట్ల ఉత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. మాడ్యూల్స్ ఉత్పాదక సామర్థ్యాన్ని 1.75 గిగావాట్లకు, సెల్స్ ఉత్పాదక సామర్థ్యాన్ని 1.25 గిగావాట్లకు పెంచుకోవాలన్నది తమ ప్రణాళిక అని, కొత్త ప్రాజెక్టుల్ని కూడా హైదరాబాద్లోనే ఏర్పాటు చేయనున్నామని సలూజా తెలిపారు. ప్రస్తుత సైట్లోనే 1 గిగావాట్ తయారీకి అవసరమైన స్థలం ఉన్నదని, మరో 1 గిగావాట్ ప్లాంటు ఏర్పాటుకు స్థలం కోసం తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన వివరించారు. ఇక గత ఆర్థిక సంవత్సరం రూ.850 కోట్లుగా ఉన్న తమ గ్రూప్ టర్నోవర్.. రూ.1,500 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. విస్తరణకు అవసరమైన నిధుల సమీకరణను ప్రస్తావిస్తూ పీఈ, గ్రీన్ ఎనర్జీ ఫండ్స్తో చర్చలు జరుపుతున్నామన్నారు.