హైదరాబాద్, సెప్టెంబర్ 24: గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ నిర్వహణదారైన జీఈఎఫ్ క్యాపిటల్ నుంచి రూ.200 కోట్ల నిధులను సేకరించినట్లు హైదరాబాద్కు చెందిన సోలార్ ఎక్విప్మెంట్ తయారీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ శుక్రవారం తెలియజేసింది. సోలార్ పీవీ సెల్, మాడ్యుల్ తయారీ సామర్థ్యం పెంపునకు ఈ నిధులను వినియోగిస్తామని ఓ ప్రకటనలో ప్రీమియర్ ఎనర్జీస్ స్పష్టం చేసింది. సెల్ తయారీ సామర్థ్యాన్ని మరో 2 గిగావాట్లు, మాడ్యుల్ ఉత్పాదక సామర్థ్యాన్ని ఇంకో 2 గిగావాట్ల మేర పెంచాలన్న లక్ష్యంతో ప్రీమియర్ ఎనర్జీస్ ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగానే వచ్చే రెండేండ్లలో రూ.1,200 కోట్లకుపైగా పెట్టుబడులకు సంస్థ సిద్ధమవుతున్నది. హైదరాబాద్లో ఈ-సిటీ వద్ద తమ నూతన స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ ప్లాంట్ను ఈ జూలైలో ప్రీమియర్ ఎనర్జీస్ ఆవిష్కరించినది తెలిసిందే. ‘భాగస్వాముల అంచనాలకు తగ్గట్లుగా సంస్థను వృద్ధిపథంలో నడిపిస్తాం’ అని సంస్థ ఎండీ చిరంజీవ్ సలుజ విశ్వాసం వ్యక్తం చేశారు.