‘వట సావిత్రి వ్రతం’ 24న
జేష్ఠ పౌర్ణమినాటి ‘వట సావిత్రీ వ్రతాని’కో ప్రత్యేకత ఉంది. ఇవాళ వట(మర్రి) వృక్షానికి పూజ చేయడంలోని పరమార్థం అపమృత్యు నివారణే.
‘మహాభారతం’లోని ‘సావిత్రి- సత్యవంతుల’ కథ ఈ వ్రతానికి మూలం. సాళువ వంశరాజ కుమారుడు చిత్రాశ్వుడు. ఇతను ఎప్పుడూ సత్యాన్నే పలుకడం వల్ల ‘సత్యవంతుడు’గా పిలువబడ్డాడు. అశ్వపతి కుమార్తె ‘సావిత్రి’. ‘సత్యవంతుడు అల్పాయుష్మంతుడు’ అని తెలిసీ పాతివ్రత్యంతో విధిని ఎదుర్కోగలననే మనోధైర్యంతో అతణ్ణి వివాహం చేసుకొంటుంది. నారదుని సూచన మేరకు, ‘అలసందలు- బెల్లంతో కలిపిన అట్లు చేసి, వెన్నముద్దతో మర్రిచెట్టుకు నివేదన చేస్తుంది. అయినా, విధి నిర్ణయం మారక సత్యవంతుడు చనిపోతాడు. సావిత్రి అంతటితో ఊరుకోకుండా, యమధర్మరాజు వెంటపడి తన భర్త ప్రాణాలు వెనక్కి తెచ్చుకుంటుంది. పౌరాణిక పరంగా ‘యముడు ఎలా ఉంటాడో’ సావిత్రి కథ మాత్రమే మనకు చెప్పగలిగింది. ‘ఈ లోకంలో జనం (భార్యాభర్తలు) ఎలా ఉండాలో’ తెలియజేయడానికే యముడు ఇలా ఆమెకు దర్శనమిచ్చినట్లు భావించాలి. ‘నువు నా వెంట రావద్దు’ అంటూనే యముడు ఆమెకు కనిపిస్తూనే వెళ్ళాడు. ఇలా, ఈ వ్రతం అపమృత్యు రక్షణలో ప్రాధాన్యం సంతరించుకుంది.
షోడశోపచారాలతో చేస్తున్నా ‘వట సావిత్రీ వ్రతం’లోని అంతరార్థం ‘మర్రిచెట్టు పూజతోపాటు ఆ మొక్కను నాటడం’గానూ అర్థం చేసుకోవాలి. మన సనాతన సంప్రదాయంలో ‘చెట్లపూజ’లలోని అర్థం, పరమార్థం వాటి స్థాపనే. ఉదా॥కు శివుని బిల్వపత్రంతో పూజించాలంటే ఆ చెట్లు లేనిది పత్రాలు ఎక్కడినుండి వస్తాయి? దసరారోజు జమ్మిచెట్టు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ రూపమైన రావిచెట్టు, ఆంజనేయస్వామికి ఇష్టమైన పారిజాతం చెట్టు, దత్తాత్రేయునికి మేడిచెట్టు, యముని అనుగ్రహం కోరి అపమృత్యువు రాకుండా మహాకాలుడికి ప్రీతికరమైన మర్రిచెట్టు .. ఇవన్నీ ఎప్పటికప్పుడు నాటుతూ తద్వారా ప్రకృతిని సేవించడం. వివాహమైన స్త్రీలు మర్రిచెట్టుకు పాలు, నీళ్లు పోసి, దానిచుట్టూ ఐదు వరుసల దారం చుట్టి, ఆ చెట్టుకింద పసుపుముద్దతో చేసిన గౌరమ్మను ‘సావిత్రి’గా తలపోసి పూజించాలని శాస్ర్తాలు చెబుతున్నాయి.
వేముగంటి శుక్తిమతి
99081 10937