న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా నిలిచే ఏ విపక్ష కూటమితో తనకు సంబంధం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. బీజేపీని విజయవంతంగా ఢీ కొట్టేందుకు థర్డ్ ఫ్రంట్ లేదా ఫోర్త్ ఫ్రంట్ నిలబడుతుందని తాను విశ్వసించడం లేదని చెప్పారు. అందుకు కారణాలను ఆయన వెల్లడించలేదు.
సోమవారం నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్తో ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. రెండు వారాల్లో రెండోసారి వారిద్దరూ భేటీ కావడం ఈ వదంతులకు బలం చేకూరింది. ఈ నెల 11వ తేదీన ముంబైలోని శరద్పవార్ నివాసంలో మూడు గంటల పాటు ప్రశాంత్ కిశోర్ చర్చలు జరిపారు.
శరద్ పవార్, ప్రశాంత్ కిశోర్ రెండు దఫాలు భేటీ కావడంతో వచ్చే ఎన్నికల్లో విపక్ష కూటమి ఏర్పాటుపై పుకార్లు షికారు చేశాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన సంచలన విజయం సాధించింది.
బీజేపీ నుంచి వచ్చిన సవాల్ను త్రుణమూల్ అధినేత మమతా బెనర్జీ గట్టిగా ఎదుర్కొని తిరిగి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. మమతా బెనర్జీ విజయం సాధించడంలో ప్రశాంత్ కిశోర్ సహకరించారు. దీంతో విపక్షాలు ఉమ్మడిగా పోటీ చేస్తే బీజేపీని ఎదుర్కోవచ్చునన్న సందేశాన్ని బెంగాల్ ఎన్నికలిచ్చాయి.
తాజాగా ప్రశాంత్ కిశోర్తో సమావేశం తర్వాత మంగళవారం విపక్ష నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. మోదీని ఎదుర్కొనేందుకు ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు చర్చలు జరుగుతాయని భావించారు.
కానీ వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆల్టర్నేటివ్ను నిలబెట్టడమే తక్షణం విపక్షాల ముందు ఉన్న సవాల్. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ ప్రజాదరణ తగ్గడంతో బీజేపీలోని కొన్నిసెక్షన్లు మౌనంగా పవార్కు మద్దతుగా నిలిచాయని సమాచారం.
అటువంటి కూటమి ఏర్పాటు కావాలంటే కాంగ్రెస్ కూడా చేరాల్సిన అవసరం ఉందని విపక్షనేతలు ఇంతకుముందు ప్రైవేట్గా అంగీకరించారు. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కూడా జాతీయ స్థాయిలో ప్రభావం గల పార్టీ కాంగ్రెస్ విపక్ష పార్టీలతో కలువాల్సిన అవసరం ఉందన్నారు.