పెరుగనున్న వాహన ధరలు
న్యూఢిల్లీ, జూన్ 21: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ సోమవారం తమ కార్ల ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో అన్ని మోడళ్ల ధరలను పెంచుతామని తెలిపింది. ఉక్కుతోపాటు వాహన తయారీలో కీలకమైన వివిధ ఉత్పత్తుల ధరలు పెరిగాయని, అందుకే ధరల పెంపు తప్పట్లేదని సంస్థ సేల్స్, మార్కెటింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ ఏప్రిల్లోనూ ఓసారి వాహన ధరలను మారుతి పెంచిన విషయం తెలిసిందే. ఆల్టో నుంచి ఎస్-క్రాస్ వరకు వివిధ మోడళ్లను మారుతి విక్రయిస్తుండగా, ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం వీటి ధరల శ్రేణి కనిష్ఠంగా రూ.3లక్షలు, గరిష్ఠంగా రూ.12.39 లక్షలుగా ఉన్నాయి.