అ.. అమ్మ
అ.. అక్షరం
మన భాషను మనం దూరం చేసుకోవడమంటే, మన ఉనికిని మనం కోల్పోవడమే! ఆ దుస్థితి బ్రిటన్లోని తెలుగు వారికి రాకూడదన్న సంకల్పమే ఎల్లాప్రగడ హేమను భాషాయోధురాలిని చేసింది. ‘యూకే తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ ద్వారా, ‘మేం తెలుగువాళ్లం. మాది తెలుగుజాతి. మేం తెలుగే మాట్లాడుతాం’ అని ప్రతి తెలుగు కుటుంబమూ సగర్వంగా ప్రకటించేందుకు సరిపడా మనోబలాన్ని ఇస్తున్నారామె.
చారిత్రక నగరి వరంగల్ ఎల్లాప్రగడ హేమ పుట్టిల్లు. దాదాపుగా ప్రపంచాన్నంతా పాలించిన బ్రిటన్లో తెలుగు వాణిని వినిపిస్తున్నారామె. ఉపాధికోసం బ్రిటన్లో స్థిరపడిన తెలుగువారు, వారి పిల్లలు… మన సంస్కృతికి, భాషకు దూరం కావద్దనే తపనతో ఓ ఉద్యమాన్ని ఆరంభించారు. ముఖ్యంగా, అక్కడ స్థిరపడిన రెండో తరానికి మాతృభాష అంటే ఏమిటో తెలియని పరిస్థితి. భాషకు దూరమైతే, సంస్కృతికి దూరమైనట్టే. సంస్కృతికి దూరమైతే జన్మభూమికి దూరమైనట్టే! ఈ దుస్థితి రాకూడదనే పిల్లల చదువుల్లో మన భాషను భాగం చేయడానికి ప్రయత్నిస్తున్నారు హేమ. ఏ దేశంలో అయినా, ‘మేం తెలుగు వాళ్లం’ అని చెప్పుకొంటేనే అక్కడి ప్రభుత్వాలు మన భాషను గుర్తిస్తాయి. ఆ భాషలో విద్యాబోధనకు అవకాశం కల్పిస్తాయి. ఇదే లక్ష్యంతో ‘యూకే తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ను ఏర్పాటు చేశారామె. బ్రిటన్ పార్లమెంటు పనితీరుపై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆ శ్రమకు గుర్తింపు దక్కింది. యూకే తెలుగు హిందూ ఆర్గనైజేషన్కు ఈ ఏడాది ‘యూకే పార్లమెంట్ వీక్ యాక్టివిటీ అవార్డు’ వచ్చింది.
చదువులు ఇక్కడే
హేమ తండ్రి వై.సుదర్శన్రావు ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ హిస్టారికల్ రిసెర్చ్ మాజీ చైర్మన్. వరంగల్లోని సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి వరకూ చదివారామె. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీఏ చేశారు. పెండ్లి తర్వాత ఇంగ్లండ్లో స్థిరపడ్డారు. వార్విక్ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో పీజీ పట్టా అందుకున్నారు. హేమ భర్త ప్రమోద్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ముగ్గురు పిల్లలు. కుటుంబం మిడ్లాండ్లో స్థిరపడింది. హాయిగా జీవితం గడుస్తున్నా, తెలుగువారికి తన వంతుగా ఏదైనా చేయాలనే తపనతో ‘యూకే తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ను స్థాపించారు హేమ. మన దగ్గర పదో తరగతికి సమానమైన చదువు బ్రిటన్లో జీసీఎస్యీ. జనాభా ఆధారంగా విద్యార్థుల మాతృ భాషలోనే జీసీఎస్యీ సిలబస్ ఉంటుంది. జీసీఎస్యీలో ఉన్న భాషలనే అక్కడి స్కూళ్లలో అమలు చేస్తారు. ఆయా భాషల పుస్తకాలను, వార్తా పత్రికలను, మ్యాగజైన్లను లైబ్రరీలో పెడతారు. ఈ భాషల సాహిత్యానికి ప్రభుత్వ ప్రోత్సాహమూ లభిస్తుంది. ఆరోగ్య సమాచారం కూడా ఈ భాషలో ఉంటుంది. రోడ్లు, ప్రధాన కేంద్రాలను తెలిపే బోర్డులపై సదరు భాషకు స్థానం కల్పిస్తారు. హిందీ, గుజరాతీ, బెంగాలీ, తమిళం ఇప్పటికే జీసీఎస్యీలో ఉన్నాయి. ఆ జాబితాలో తెలుగు భాషకు చోటు లేకపోవడం హేమను కలవర పరచింది. తెలుగుకు సముచిత స్థానం లేకపోవడం వల్ల, భవిష్యత్తు తరాలు తెలుగు అక్షరానికి పూర్తిగా దూరమవుతాయి. పరిస్థితి అంతవరకూ రాకూడదంటే, జీసీఎస్యీలో తెలుగు భాషకు చోటివ్వాలని పిలుపునిచ్చారు.
సగర్వంగా చెప్పేలా..
జనాభా లెక్కలను బట్టే బ్రిటన్లో విధాన నిర్ణయాలు ఉంటాయి. ఆ డాటా ఆధారంగానే పౌర సౌకర్యాలు కల్పిస్తారు. బ్రిటన్లో స్థిరపడిన తెలుగువారిలో డాక్టర్లు, సాఫ్ట్వేర్ నిఫుణులు ఎక్కువ. కానీ, రికార్డుల పరంగా మాత్రం బ్రిటన్లో మన వాళ్ల సంఖ్య తక్కువే. దీంతో జీసీఎస్యీలో చేర్చే విషయంలో అక్కడి ప్రభుత్వం ప్రతిపాదనలు చేయలేకపోతున్నది. ఎల్లాప్రగడ హేమ దీనిపై దృష్టి సారించారు. 2011 బ్రిటన్ జనాభా లెక్కల ప్రకారం తెలుగువారి జనాభా 14,653 మాత్రమే. వాస్తవంగా 30 వేల మందికిపైగా ఉన్నారు. జనాభా లెక్కల సేకరణ సమయంలో ఎక్కువమంది తెలుగువారు తమ మాతృభాష ఇంగ్లిష్ అని చెప్పడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. మన సంఖ్య ఎక్కువగా ఉంటేనే తెలుగును బోధన భాషగా గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో మాతృభాష విషయంలో కచ్చితమైన గణాంకాలను నమోదు చేయించేందుకు హేమ పూనుకొన్నారు. అక్కడున్న 39 తెలుగు సంఘాలను ఒకే వేదికపైకి తెచ్చారు. తెలుగు కుటుంబాలను ఒకచోటకు చేర్చి బ్రిటన్ పార్లమెంటు వ్యవస్థ, ప్రభుత్వ పాలన తీరు, బిల్లుల రూపకల్పన, చట్టసభల ఆమోదంపై అవగాహన కల్పించారు. దేశ వ్యాప్తంగా 266 చోట్ల కార్యక్రమాలను నిర్వహించారు. దీనికి గుర్తింపుగా ఎల్లాప్రగడ హేమ 2021 సంవత్సరానికిగాను ‘యూకే పార్లమెంట్ వీక్ యాక్టివిటీ’ అవార్డుకు ఎంపికయ్యారు. ఇక, మిగిలిందల్లా.. మాతృభాషలో చదువు. ఆ రోజు కూడా ఎంతో దూరం లేదు.
… పిన్నింటి గోపాల్
నమస్తే తెలంగాణ ప్రతినిధి, వరంగల్
మూలాలకు దూరం కావొద్దు
వ్యవస్థలో మార్పు రావాలంటే, మనం వ్యవస్థలోనే ఉండాలి. బ్రిటన్లో వేలమంది తెలుగువారు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన మొదటి తరం మూలాలను మరచిపోలేదు. రెండో తరానికి వచ్చేసరికి ఇబ్బంది ఉంటున్నది. మొదటితరం తమ పిల్లలకు మాతృభాష గురించి అవగాహన పెంచకపోవడం వల్లే రెండోతరం మూలాల నుంచి దూరమవుతున్నది. ఇలాగే కొనసాగితే, భవిష్యత్ తరాలు మన సంస్కృతిని, భాషను కోల్పోతాయి. ఇది మన మనుగడకే ప్రమాదం. బ్రిటన్లోని విద్యా వ్యవస్థలో మన పదో తరగతికి సమానమైన జీసీఎస్యీలో తెలుగుభాషను ఓ ఐచ్ఛికంగా తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. బ్రిటన్లో జనాభానుబట్టి విధానాలను రూపొందిస్తారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు జనగణన ప్రక్రియ నడుస్తున్నది. మన మాతృభాష ఇదేనని చెప్పడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదని అందరికీ తెలియజెప్పాం. ఆఫీస్ ఆఫ్ ది నేషనల్ స్టాటిస్టిక్స్ వాళ్లను పిలిచి అవగాహన కల్పించాం. ఈసారి మన వాళ్ల కచ్చితమైన సంఖ్య నమోదవుతుంది. జీసీఎస్యీలో తెలుగును చేర్చేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
ఎల్లాప్రగడ హేమ, యూకే తెలుగు హిందూ ఆర్గనైజేషన్
ఇవి కూడా చదవండి: