న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) రూ.50 లక్షల కంటే అధిక గృహ రుణంపై విధించే వడ్డీరేటును అర శాతం తగ్గించింది. దీంతో రుణ రేటు 6.60 శాతానికి పరిమితమైంది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఈ వడ్డీరేటు వర్తింపచేయనున్నట్లు వెల్లడించింది. అలాగే 7.15 శాతం వడ్డీతో వాహన రుణాలు, 8.95 శాతం వడ్డీతో వ్యక్తిగత రుణాలు ఆఫర్ చేస్తున్నది. మరోవైపు రెపోతో అనుసంధానమైన రుణాలపై విధించే వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. దీంతో రుణ రేటు 6.55 శాతానికి దిగిరానున్నది. తగ్గించిన వడ్డీరేట్లు వెంటనే అమల్లోకి రానున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.