న్యూఢిల్లీ: తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలను భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ బద్దలుకొట్టాడు. ఇప్పట్లో ఆటకు వీడ్కోలు పలికే ఆలోచనే లేదని స్పష్టం చేశాడు. దేశం కోసం ఆడాలన్న అంకితభావం, తపన ఇంకా తనలో చాలా ఉన్నాయని బుధవారం ఆన్లైన్ చర్చలో ఛెత్రీ అన్నాడు. ప్రస్తుతం ఖతార్ పర్యటనలో టీమ్ఇండియా ఉండగా.. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఛెత్రీ రెండు గోల్స్తో జట్టును గెలిపించాడు. అంతర్జాతీయ గోల్స్లో లియోనెల్ మెస్సీని అధిగమించాడు. ‘ఆటకు వీడ్కోలు పలకడం గురించి అసలు ఆలోచించడం లేదు. నేను ఫుట్బాల్ను ఆస్వాదిస్తున్నా. ఇప్పుడు ఉన్నంత ఫిట్గా గతంలో ఎప్పుడూ లేను. నాకు 36 ఏండ్లు వచ్చినా.. దేశం కోసం ఆడాలన్న కసి, పట్టుదల చాలా ఉన్నాయి.. నన్ను మెస్సీతోనే కాదు ఎవరితోనూ పోల్చవద్దు’ అని ఛెత్రీ అన్నాడు.