న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఆటోమొబైల్, డ్రోన్ పరిశ్రమల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించేక్రమంలో కేంద్ర క్యాబినెట్ భారీ ప్రోత్సాహక పథకానికి పచ్చజెండా ఊపింది. రూ.26,058 కోట్ల విలువైన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమును క్యాబినెట్ ఆమోదించిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. క్యాబినెట్ సమావేశం అనంతరం బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లపాటు అమలులో ఉండే ఈ స్కీము కారణంగా ఆటోమొబైల్, ఆటో విడిభాగాల పరిశ్రమ రూ.42, 500 కోట్లు తాజాగా పెట్టుబడి చేస్తుందని అంచనావేస్తున్నట్లు తెలిపారు. అలాగే రూ.2.3 లక్షల కోట్ల విలువైన అదనపు ఉత్పత్తి జరుగుతుందని, 7.5 లక్షలకుపైగా అదనపు ఉపాధి కలుగుతుందని భావిస్తున్నామన్నారు. 2021-22 బడ్జెట్లో ప్రతిపాదించిన 13 రంగాలకు ప్రతిపాదించిన రూ.1.97 లక్షల కోట్ల పీఎల్ఐ స్కీముల్లో భాగంగా ఆటోమొబైల్, ద్రోన్ పరిశ్రమలకు తాజాగా ప్రోత్సాహకాల్ని ప్రకటించారు. ఈ స్కీములో రెండు విభాగాలున్నాయి. అవి…
చాంపియన్ ఓఈఎం ఇన్సెంటివ్ స్కీమ్: ఇది అమ్మకాల విలువతో అనుసంధానమైన పథకం. ఇది బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలకు వర్తిస్తుంది.
కాంపోనెంట్ చాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్: ఇది కూడా అమ్మకాల విలువతో అనుసంధానమైనదే. వాహనాల అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాంపొనెంట్స్, వివిధ వాహనాల సీకేడీ, ఎస్కేడీ కిట్స్కు వర్తిస్తుంది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఇటీవల ప్రకటించిన రూ.10,000 కోట్ల పీఎల్ఐ స్కీము, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ తయారీకి ప్రారంభించిన రూ.18,100 కోట్ల పీఎల్ఐ స్కీములకు తాజా స్కీము అదనమని మంత్రి ఠాకూర్ వివరించారు.
ఆదాయ లక్ష్యాలు కలిగి, దేశీయంగా విలువను చేకూర్చే డ్రోన్లకు పీఎల్ఐ స్కీమును అమలుచేయనున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వ్యూహాత్మక, నిర్వహణా వినియోగాల కోసం తయారుచేసే డ్రోన్లు, డ్రోన్ విడిభాగాల పరిశ్రమకు రూ.120 కోట్ల పీఎల్ఐ స్కీము మూడేళ్లు అమలులో ఉంటుంది. డ్రోన్లు, డ్రోన్ విడిభాగాల వార్షిక విక్రయాల ఆదాయం ఆధారంగా ఈ ప్రోత్సాహకాన్ని అందిస్తారు. ఈ స్కీము ద్వారా లబ్దిపొందాలంటే చిన్న, మధ్యతరహా డ్రోన్ తయారీ సంస్థలకైతే వార్షిక టర్నోవర్ రూ.2 కోట్లు, డ్రోన్ విడిభాగాల సంస్థ టర్నోవర్ రూ.50 లక్షలు ఉండాలి. స్కీము అమలుతో ఈ రంగంలోకి రూ.5,0 00 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనావేస్తున్నట్లు మంత్రి చెప్పారు. రూ.1,500 కోట్ల విలువైన అమ్మకాలు జరగవచ్చని, 10,000 మందికి ఉపాధి లభించవచ్చని అంచనావేస్తున్నామని ఆయన తెలిపారు.
‘భవిష్యత్ టెక్నాలజీలను వేగంగా అందుకునేందుకు తాజా పీఎల్ఐ స్కీము ఉపకరిస్తుంది’
-వేణు శ్రీనివాసన్ చైర్మన్ టీవీఎస్ మోటార్
‘ఆటోమొబైల్ పరిశ్రమ ఎగుమతుల్ని పెంచుకోడానికి ఈ స్కీము ఒక భారీ అవకాశం. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి ఇండియా కేంద్రస్థానంగా మారుతుంది’
-విపిన్ సోన్ది, ఎండీ- అశోక్లేలాండ్. వైస్ ప్రెసిడెంట్, సియామ్