న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్లపై కేంద్రం విధించే దిగుమతి, ఎక్సైజ్ సుంకాలు.. రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే వ్యాట్ వల్లే వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. చమురు ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకొస్తేనే దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.75లకు దిగి వస్తుందని ఎస్బీఐ అభిప్రాయ పడ్డారు.
కానీ పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి రాజకీయ నాయకులు సిద్ధంగా లేరని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దానివల్లే అందువల్లే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయని స్పష్టం చేశారు.
‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రోలియం ఉత్పత్తులపై విధించే వ్యాట్, ఇతర సుంకాలు, పన్నులే ప్రధాన ఆదాయవనరులు. అందుకే చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేవు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్, ఎక్సైజ్ సుంకం, సెస్, వ్యాట్ ఇలా పలు రకాల పన్నులు, ఛార్జీలు విధిస్తున్నాయి’ అని ఆ ఆర్థిక వేత్తలు అభిప్రాయ పడ్డారు.
‘లీటర్ పెట్రోల్పై రవాణా ఛార్జీలు రూ. 3.82, డీలర్ కమిషన్ రూ. 3.67, సెస్ రూ.30గా ఉంది. ఇక డీజిల్పై రవాణా ఛార్జీలు రూ. 7.25, డీలర్ కమిషన్ రూ. 2.53, సెస్ రూ. 20గా ఉంది. ఒకవేళ జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే డీజిల్, పెట్రోల్లపై గరిష్ఠంగా 28శాతం పన్ను ఉంటుంది. చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ నష్టం తప్పదు. అలా తెస్తే మాత్రం వినియోగదారులపై రూ.30 వరకు భారం తగ్గుతుంది. అప్పుడు లీటర్ పెట్రోల్ రూ. 75, లీటర్ డీజిల్ రూ. 68కే వస్తుంది’ అని వారు స్పష్టం చేశారు.
జీఎస్టీ పరిధిలోకి ఇంధన ఉత్పత్తులను తేవడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందని, దేశ జీడీపీలో ఇది కేవలం 0.4 శాతం మాత్రమేనని ఎస్బీఐ ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు. అంతేగాక, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో ఇంధన ధరల్లో రోజువారీ మార్పులు చేయకుండా చమురు ధరలను స్థిరీకరించాలని హితవు చెప్పారు. అంటే.. అంతర్జాతీయ ధరలు తగ్గినప్పుడు వచ్చే లాభాలను, ధరలు పెరిగినప్పుడు వచ్చే లోటుతో పూడ్చుకోవాలన్నారు. అలా చేస్తే వినియోగదారులపై ఎలాంటి భారం పడదని పేర్కొన్నారు.