Petrol Price | దాదాపు అన్ని రాష్ట్ర రాజధానుల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. కేంద్ర చమురు సంస్థలు వరుసగా ఏడో రోజు సోమవారం కూడా ఇంధన ధరలు పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 83.59 డాలర్లకు చేరుకున్నది. దీంతో సోమవారం ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, పంజాబ్, బీహార్ రాష్ట్రాలు జమ్ముకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంత రాజధానుల్లో సోమవారం ఉదయం పెట్రోల్ లీటర్ ధర రూ.100 దాటింది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.41కాగా, లీటర్ డీజిల్ ధర రూ.101.03లకు చేరుకున్నది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు పెరిగి రూ.104.44లకు చేరుకోగా, లీటర్ డీజిల్ ధర 35 పైసలు పెరిగి రూ.93.17 వద్ద స్థిరపడింది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ రూ.105,బెంగళూరులో రూ.108.08, చెన్నైలో రూ.101.79 పలుకుతోంది. ఆయా రాష్ట్రాల్లోని నగరాల్లో స్థానిక వ్యాట్ చార్జీలు వేర్వేరుగా ఉండటంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో తేడాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్లపై రవాణా చార్జీలు, స్థానిక పనులు, వ్యాట్ ఆధారంగా పెంచుతారు. ఈ నెలలో పెట్రోల్ ధరలు పెరగడం 11వ సారి. సెప్టెంబర్ 24నుంచి 14వ సారి.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రకారం లీటర్ పెట్రోల్ ధర రూ.41, పెట్రోల్ పంపు డీలర్కు రూ. 3.79తో దాని ధర రూ.44. సెంట్రల్ చార్జీలు రూ.32.9 కాగా, రాష్ట్ర పన్నులు రూ.20 విధిస్తున్నారు. పెట్రోల్పై కేంద్రం రూ.32.9, రాష్ట్ర పన్నులు లీటర్కు రూ.20 ఉంటాయి. లీటర్ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, కమిషన్ కలుపుకుంటే వాస్తవంగా పెట్రోల్ ధర రెట్టింపుకు పైగా ఉంటుంది. పెట్రోల్పై పన్నులు 58 శాతం, డీజిల్పై 52 శాతం పన్నులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి.