నెలనెలా జరిగే ఆటో డెబిట్ చెల్లింపులకు వచ్చే నెల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన నిబంధన అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నది. దీంతో డెబిట్, క్రెడిట్ కార్డులతోపాటు మొబైల్ వ్యాలెట్లతో రూ.5వేలకు మించి ఆటో డెబిట్ ద్వారా జరిపే చెల్లింపులకు ఒక రోజు ముందుగానే వినియోగదారులు తమ అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఈ అదనపు ధ్రువీకరణ (అడిషనల్ ఫ్యాక్టర్ అథంటికేషన్-ఏఎఫ్ఏ) కోసం ముందుగానే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వినియోగదారునికి మెయిల్ లేదా మెసేజ్ పంపుతాయి. ఈ మెసేజ్లో మర్చంట్ పేరు, డెబిట్ అయ్యే మొత్తం, తేదీ, సమయం, రిఫరెన్స్ నంబర్, లావాదేవీకి గల కారణం వంటి వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. ఒకవేళ వినియోగదారుడు ఆ మెసెజ్కు స్పందించకపోతే చెల్లింపులు ఆగిపోతాయి. అందుకని వాటికి లింక్ చేసిన మొబైల్ నంబర్, ఈ మెయిల్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఓ సారి పరిశీలించండి. లేకపోతే బ్యాంకుల నుంచి మీకు రావాల్సిన మెసెజ్ అందకపోవచ్చు. ఆటో డెబిట్ చెల్లింపుల్లో ఎక్కువగా నెట్ఫ్లిక్స్, ఆమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్స్, రీఛార్జబుల్ బిల్లులే ఉంటున్నాయి. అయితే ఇవి కూడా రూ.5వేలు మించి ఉంటే ఇబ్బందే. కాగా, ఇన్సూరెన్స్ ప్రీమియం, మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ వంటి చెల్లింపులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.