న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: హైదరాబాద్లో ఇండ్ల కొనుగోలు శక్తి పెరిగింది. కొనుగోలుదారుల స్థోమత గతేడాదితో పోల్చితే ఈ ఏడాది మెరుగుపడినట్లు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. హైదరాబాద్సహా దేశంలోని ప్రధాన నగరాల్లో జేఎల్ఎల్ ఇండియా ఓ సర్వే నిర్వహించింది. ఈ నేపథ్యంలో సోమవారం తమ వార్షిక గృహ కొనుగోలు స్థోమత సూచీ (జేఎల్ఎల్ హెచ్పీఏఐ 2021)ని విడుదల చేసింది. గృహస్తుల ఆదాయం జోరందుకున్నట్లు ఇందులో వివరించింది. కరోనా కారణంగా నిరుడు అన్ని వర్గాల ప్రజల ఆదాయాలు తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది పరిస్థితులు మెరుగైనట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది గృహస్తుల ఆదాయం నిరుడుతో చూస్తే 7-9 శాతం మేర పుంజుకున్నట్లు పేర్కొన్నది.
కలిసొచ్చిన చౌక వడ్డీరేట్లు
పెరిగిన ఆదాయానికితోడు గృహ రుణాలపై తగ్గిన వడ్డీరేట్లు కూడా ఇంటి కొనుగోలు శక్తిని పెంచాయని జేఎల్ఎల్ తెలియజేసింది. స్థిరంగా ఉన్న ధరలు సైతం ఇందుకు దోహదపడ్డాయని అభిప్రాయపడింది. ‘గడిచిన 15 ఏండ్లలో ఎన్నడూలేనంత స్థాయికి బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ వడ్డీరేట్లను తగ్గించాయి. ఫలితంగా ఈఎంఐ భారం దిగింది. ఇది ఇండ్ల కొనుగోళ్లను పెంచింది’ అని జేఎల్ఎల్ వెల్లడించింది.
భాగ్యనగరంలోనే డిమాండ్
దేశంలోని ఇతర ప్రముఖ రెసిడెన్షియల్ మార్కెట్లలో ఇండ్ల ధరలు స్తబ్ధుగా ఉన్నా.. హైదరాబాద్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించట్లేదని జేఎల్ఎల్ చెప్పింది. నగరంలో ఇండ్లకున్న డిమాండ్ను ఇది తెలియజేస్తున్నట్లు తెలిపింది. కాగా, ఈ ఏడాది హైదరాబాద్లో ఇండ్ల కొనుగోలు శక్తి సూచీ 200 మార్కును దాటవచ్చని అంచనా వేసిన జేఎల్ఎల్.. నిరుడుతో చూస్తే 193 నుంచి 203కు ఎగబాకవచ్చన్నది. ఇక దేశంలో ముంబై స్థిరాస్తి మార్కెట్ను అత్యంత ఖరీదైనదిగా జేఎల్ఎల్ పేర్కొన్నది. అలాగే హైదరాబాద్, కోల్కతాల్లో సగటు ఆదాయాన్ని అందుకుంటున్న గృహస్తులకు వెయ్యి చదరపు అడుగులున్న రెండిండ్లకైనా లోన్ తీసుకునేందుకు అర్హత ఉందన్నది.