సిటీబ్యూరో, జులై 1(నమస్తే తెలంగాణ): తాము చెప్పినట్లు పెట్టుబడి పెడితే.. అందులో మంచి లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. నగరానికి చెందిన ఇద్దరి నుంచి రూ.3.44 లక్షలు కాజేశారు. సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోమాజిగూడకు చెందిన సురేశ్కు .. నేహానాయక్ పేరుతో ఓ మహిళ ఫోన్ చేసింది.. మేం చెప్పినట్లు పెట్టుబడులు పెడితే.. మంచి లాభాలు వస్తాయంటూ నమ్మించి, ఒక లింక్ను పంపించింది. ఆమె చెప్పినట్లు ముందుగా వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయగా.. వెంటనే రూ. 3 వేలు లాభం వచ్చిందంటూ నమ్మించింది. సంతోషంతో బాధితుడు ఒక్కసారిగా రూ. 1.6 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అనంతరం ఆ మహిళ ఫోన్ను స్విచాఫ్ చేసింది..
మరో ఘటనలో .. అంబర్పేట్కు చెందిన రవీందర్కు ఫోన్ చేసిన సైబర్నేరగాళ్లు.. పెట్టుబడి పెడితే భారీ లాభాలు ఇప్పిస్తామని నమ్మించారు.. ఇందుకు ఓ యాప్ను డౌన్లోడ్ చేయించి.. అందులో పెట్టుబడి పెట్టాలని చెప్పగానే.. ముందుగా రూ. వెయ్యి పెట్టగా.. రూ. 3 వేల లాభం చూపించారు. ఇంకా ఎక్కువ పెడితే భారీ ఎత్తున లాభాలొస్తాయంటూ ఆశ చూపి.. రూ. 1.82 లక్షలు పెట్టుబడి పెట్టించారు. ఆ తర్వాత ఫోన్లు స్విచాఫ్ చేశారు.
ఇంకో ఘటనలో.. ధూల్పేట్కు చెందిన అనిల్సింగ్కు సైబర్నేరగాళ్లు ఫోన్ చేసి.. తమ వద్ద రెండు ఆర్బీఎల్ క్రెడిట్కార్డులు ఉన్నాయని.. అందులో ఒకటి అతను వాడుకునేలా చేస్తామంటూ నమ్మించారు.. ఇందుకు బాధితుడి నుంచి ఓటీపీలు తీసుకొని.. అతని ఖాతా నుంచి రూ. 1.2 లక్షలు స్వాహా చేశారు. ఆయా ఫిర్యాదులపై కేసులు నమోదు చేసుకొని ఏసీపీ కేవీఎం నేతృత్వంలోని బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.