ముంబై, జూన్ 8: పన్నుల భారం, ముఖ్యంగా అధిక పరోక్ష పన్నులు గృహస్తుల వినీమయ సామర్థ్యాన్ని దెబ్బ తీస్తున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తెలిపింది. మరిన్ని వస్తూత్పత్తులను కొనుగోలు చేయకుండా ఈ పన్నులు అడ్డుపడుతున్నాయన్నది. ఇలాగే జరిగితే వినియోగం పుంజుకోవడం కష్టమేనని హెచ్చరించింది. అసలే కరోనా ప్రభావంతో మార్కెట్ మందగమనంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక ప్రధానంగా ఇంధన ధరల్లో పెరుగుతున్న ఎక్సైజ్ సుంకం.. పరోక్ష పన్నుల భారాన్ని స్థూలంగా మరింత పెంచుతున్నదని అభిప్రాయపడింది. 2009-10లో గృహస్తులపై మొత్తం పన్నుల భారం 60 శాతంగా ఉంటే.. ఇప్పుడు 75 శాతానికి పెరిగినట్లు గుర్తుచేసింది.
ఆదాయం పన్నును హేతుబద్దీకరిస్తూ కార్పొరేట్లపై ప్రేమ చాటుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. గృహస్తులపై పెరుగుతున్న పన్నుల భారాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఇండియా రేటింగ్స్ విమర్శించింది.