న్యూఢిల్లీ, ఆగస్టు 26: కేంద్రం ప్రైవేటీకరించనున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) బిడ్డింగ్ ప్రక్రియలో అంతర్జాతీయ చమురు కంపెనీలు పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే బీపీసీఎల్ను కొనుగోలు చేసేందుకు పోటీలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్తో చమురు కంపెనీలు చేతులు కలిపిఉంటాయని ఈ కంపెనీ డిజిన్వెస్ట్మెంట్పై రూపొందిన ఒక డాక్యుమెంట్లో పేర్కొన్నారు. కమోడిటీ వాణిజ్యవేత్త అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత గ్రూప్, అమెరికాకు చెందిన రెండు ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్-అపోలో గ్లోబల్, ఐ స్కేర్డ్ క్యాపిటల్లు బీపీసీఎల్ కోసం గతేడాది ఆసక్తి బిడ్స్ సమర్పించాయి. ఈ కంపెనీలో ప్రభుత్వానికి ఉన్న మొత్తం 52.98 శాతం వాటాను ప్రైవేటు కంపెనీలకు విక్రయించాలని ప్రతిపాదించారు. ఈ డిజిన్వెస్ట్మెంట్పై తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై రూపొందించిన డాక్యుమెంట్లో అంతర్జాతీయ చమురు కంపెనీల చేతులు కలుపుతున్న అంశాన్ని ప్రస్తావించారు. బీపీసీఎల్ కోసం కన్సార్షియంలు (సంస్థలు జతకలవడం) ఏర్పాటవుతున్నందున, బిడ్డర్లపై సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం ఉంటుందని ఆ డాక్యుమెంట్లో పేర్కొన్నారు.
మధ్యప్రాచ్య చమురు దిగ్గజానికి ఆసక్తి?
నిబంధనల ప్రకారం పలు కంపెనీలు కన్సార్షియంగా ఏర్పడి బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనే అనుమతి ఉంది. కన్సార్షియంలోని ఒక కంపెనీ మాత్రమే బిడ్ సమర్పించవచ్చు. బీపీసీఎల్పై ఆసక్తి బిడ్స్ (ఈవోఐ) సమర్పించేందుకు 2020 నవంబర్ 16 చివరితేదీకాగా, అప్పటికి దేశీ శ్రీమంతులైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలకు చెందిన కంపెనీలుగానీ, అంతర్జాతీయ చమురు కంపెనీలైన రాయల్డచ్ షెల్, బీపీ, ఎక్సాన్లు బిడ్లు వేయలేదు. మధ్యప్రాచ్య దేశాలకు చెందిన చమురు ఉత్పత్తి దిగ్గజాలు, రష్యాకు చెందిన రాస్నెప్ట్లకు బీపీసీఎల్ను టేకోవర్ చేసే ఉద్దేశ్యం ఉందని వెల్లడైనప్పటికీ, అవి కూడా ఈవోఐలు సమర్పించలేదు. అయితే మధ్యప్రాచ్య దేశాలకు చెందిన ఒక చమురు దిగ్గజ సంస్థ&ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్తో జతకలిసిందని, అది ఇప్పటికే బీపీసీఎల్ కొనుగోలు రేసులో ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.