న్యూఢిల్లీ : గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్ క్వార్టర్లో ఈ- కామర్స్ వేదికలపై డిస్కౌంట్లు భారీగా ఉండనున్నాయి. పండుగ సీజన్కు ముందు స్టాక్స్ను తగ్గించుకునే దిశగా పలు బ్రాండ్లపై డిస్కౌంట్ ఆఫర్లను ఆయా కంపెనీలు ప్రకటించనున్నాయి. ఉత్పాదక, రవాణా వ్యయాలు పెరిగినా ఈసారి స్మార్ట్ఫోన్లు, దుస్తులు, కిరాణా సరుకులు, ఏసీల అమ్మకాలు పెరిగేలా భారీ డిస్కౌంట్లు ఉంటాయనే అంచనాలు వెల్లడవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్తో అమ్మకాలు దెబ్బతినడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు సైతం డిస్కౌంట్ల బాటపట్టనున్నాయి.
అమెజాన్, ప్లిఫ్కార్ట్, జియోమార్ట్ వంటి ఈ కామర్స్ దిగ్గజాలు బిస్కెట్లు, ఆటా, మసాలా దినుసులు, శీతల పానీయాలు, స్నాక్స్, నెయ్యి, సోపులపై ఈనెల నుంచి 60 శాతం వరకూ డిస్కౌంట్లు ప్రకటించాయి. ఇక ప్లిఫ్కార్ట్ కొన్ని వస్తువులను రూ 1కి కూడా విక్రయిస్తోంది. కరోనా సెకండ్ వేవ్తో ఏప్రిల్, మే నెలల్లో లాక్డౌన్ ఫలితంగా పేరుకుపోయిన ఇన్వెంటరీని వదిలించుకునేందుకు డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
గత ఏడాది జూన్ క్వార్టర్లో డిస్కౌంట్ ఆఫర్లు లేకపోగా ఈ ఏడాది ఇదే సమయంలో సగటు డిస్కౌంట్లు ఏడు నుంచి పది శాతం వరకూ ఉండే అవకాశం ఉందని ఐడీసీ ఇండియా మార్కెట్ ట్రాకర్ రీసెర్చ్ డైరెక్టర్ నవ్కేందర్ సింగ్ పేర్కొన్నారు. పండగ సీజన్లో కొత్త మోడల్స్ను లాంఛ్ చేసే క్రమంలో అమ్మకం పూర్తి కాని స్టాక్ను సేల్ చేసేలా పలు బ్రాండ్లు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తాయని అంచనా వేశారు. గత ఏడాది పేరుకుపోయిన ఇన్వెంటరీతో ఏసీలు, గృహోపకరణాల పైనా మరిన్ని డిస్కౌంట్లు, రాయితీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.