న్యూఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ జీరో, క్వశ్చన్ అవర్లను రద్దు చేశారు. ఏకధాటిగా సుమారు 9 గంటల పాటు ఫైనాన్స్ బిల్లుపై చర్చ చేపట్టనున్నట్లు రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు తెలిపారు. నిన్న జరిగిన మీటింగ్లో శూన్యకాల, ప్రశ్నోత్తరాలను రద్దు చేయాలని నిర్ణయించామని, ఫైనాన్స్ బిల్లుపై చర్చిద్దామని వెంకయ్య అన్నారు. బీహార్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేపై పోలీసులు దాడి చేసిన ఘటనను ఆర్జేడీ సభ్యుడు మనోజ్ లేవనెత్తారు. దానిపై చర్చించేందుకు వెంకయ్య తిరస్కరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లు 2021ను ప్రవేశపెట్టారు. దీనిపై 9 గంటల పాటు చర్చించనున్నారు.
బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ దీపేంద్ర సింగ్ హూడా మాట్లాడారు. కోవిడ్ మహమ్మారి కన్నా ముందు నుంచే ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వరుసగా 8 క్వార్టర్స్లో ప్రగతి లేదన్నారు. యూపీఏ సమయంలో జీడీపీ సగటు వృద్ధి రేటు 7.8 శాతంగా ఉందని, కానీ గత ఆరేళ్ల నుంచి ప్రగతి రేటు కేవలం 6.8 శాతంగా ఉన్నట్లు ఆయన ఆరోపించారు. యూపీఏ సమయంలో పరిశ్రమల ప్రగతి రేటు 4 శాతం ఉండగా, ఇప్పుడు అది కేవలం రెండు శాతం మాత్రమే ఉందన్నారు.
మరోవైపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను కుదించే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి రెండో దఫా సమావేశాలు ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగాల్సి ఉన్నది. కానీ అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. పార్లమెంట్ సమావేశాలను ఈనెల 25వ తేదీ వరకు మాత్రమే నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర సమాచారం అందాల్సి ఉన్నది.