44 శాతం మందికి టీకాలు పంపిణీ
మహారాష్ట్ర సరిహద్దుల్లో స్పెషల్ డ్రైవ్.. 16 గ్రామాల్లో చెక్పోస్టులు
కరోనా చికిత్సకు 140 ఆక్సిజన్ బెడ్లు సిద్ధం
తాత్కాలిక ప్రాతిపదికపై సిబ్బంది నియామకం
అధికారులతో సమీక్షలో మంత్రి వేముల
కామారెడ్డి, ఏప్రిల్ 17: కరోనా వ్యాక్సిన్ పంపిణీలో కామారెడ్డి ప్రథమ స్థానంలో ఉన్నదని మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. కరోనా నియంత్రణపై కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత భవన్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్కుమార్తో కలిసి మంత్రి ప్రశాంత్రెడ్డి అధికారులతో శనివారం సమీక్షించారు. జిల్లా అధికారులు చేస్తున్న కృషి సంతృప్తికరంగా ఉన్నదని మంత్రి కితాబు ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. జిల్లాలోని 29 ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి రోజూ మూడు వేల మందికి పరీక్షలు చేస్తున్నారని, ఇప్పటివరకు లక్షా 50 వేల మందికి పరీక్షలు చేశామని, ఇందులో నాలుగు వేల యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. వీరిలో 50 మంది ఏరియా దవాఖానలో చికిత్స పొందుతుండగా.. మిగితా వారు హోమ్ ఐసొలేషన్లో ఉన్నారని చెప్పారు.
పరీక్షల నిర్వహణకు తాత్కాలిక ప్రాతిపదికపై 19 మంది సిబ్బందిని నియమించుకోవాలని, ఇందుకోసం రూ.మూడు లక్షల నిధులు సమకూరుస్తామని చెప్పారు. జిల్లాలో 45 ఏండ్లు పైబడిన వారు 2 లక్షల 33 వేల 814 మంది ఉండగా ఇప్పటికే జిల్లాలో 30 కేంద్రాల ద్వారా లక్షా 3 వేల 254 మందికి వాక్సిన్ వేసినట్లు తెలిపారు. 44 శాతం పూర్తి కావడంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. కరోనా రోగుల కోసం కామారెడ్డిలో 50, బాన్సువాడలో 50, మద్నూర్, దోమకొండ, ఎల్లారెడ్డిలో పది చొప్పున బెడ్లను సిద్ధంగా ఉంచుతామన్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. 16 గ్రామాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శరత్ తెలిపారు. సరిహద్దులో రాకపోకలను నియంత్రించాలని, ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేయాలని మంత్రి సూచించారు. మాస్కు లు ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసు అధికారులను ఆదేశించారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైద్య, రెవెన్యూ, పోలీసు, పంచాయతీ, మున్సిపల్, పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయంగా కరోనాను ఎదుర్కొవాలని మంత్రి కోరారు.