న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశిస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. మొత్తం దేశీయ మార్కెట్ రూపురేఖలను మార్చే దిశగా అడుగులేస్తున్నది. శరవేగంగా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ వాడకం దిశగా వినియోగదారులు మళ్లేందుకు సర్వం సిద్ధం అవుతున్నది.
విద్యుత్ బైక్స్, స్కూటర్లతో ఈవీ మార్కెట్లోకి దూకుడుగా దూసుకెళ్లాలని భావిస్తున్న బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్, టీవీఎస్ మోటార్స్ సంస్థలకు ఓలా ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్తో జంట సవాళ్లు ఎదురు కానున్నాయి. ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ)తో ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లు మార్కెట్లోకి రానున్నాయి.
కానీ విపణిలోకి రానున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఇతర సంస్థల స్కూటీలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీని ధర రూ.85 వేల నుంచి రూ.1.1 లక్షల వరకు పలుకుతుండవచ్చు. దేశీయంగా అమ్ముడవుతున్న ఐసీఈ స్కూటర్ల ధరలతో పోలిస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 70 శాతమే.
ఇతర టూ వీలర్ తయారీ సంస్థలు ఈవీ అడాప్షన్ ద్వారా బెనిఫిట్ పొందాలని తలపోస్తున్నాయిన ఎంకే గ్లోబల్ అనే రీసెర్చ్ సంస్థ వ్యాఖ్యానించింది. హీరో ఎలక్ట్రిక్, ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా, అంపేర్ వంటి సంస్థల స్కూటర్ల నుంచి వచ్చే పోటీ వల్ల ప్రధాన సంస్థల లాభాలు మోస్తరుగా తగ్గుతాయని, వాటి మార్కెట్పై ఒత్తిడి పెరుగుతుందని అంచనా వేసింది.
గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,43,837 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్ముడయ్యాయి. మొత్తం వాహనాల్లో ఇది ఒక శాతం లోపే. స్థానికంగా బ్యాటరీల ఉత్పత్తితో వ్యయం తగ్గింపు, ప్రభుత్వాలు కల్పిస్తున్న బెనిఫిట్లతో ఈవీల ధరలు తగ్గిపోతాయి. మధ్యకాలికంగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్స్ 5-10 శాతం పెరుగుతాయని ఎంకే అంచనా వేస్తున్నది.
ఇతర సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకు వినియోగదారులకు ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి తీసుకొస్తున్నది ఓలా ఎలక్ట్రిక్. దీనివల్ల దేశీయ సంప్రదాయ టూ వీలర్ సెగ్మెంట్ పూర్తిగా చెదిరిపోయే అవకాశాలు ఉన్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య మఖారియా చెప్పారు.
ఫేమ్-2 స్కీమ్తో ప్రభుత్వం కల్పించే రాయితీలతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్.. న్యూఏజ్ టూ వీలర్ కంపెనీలకు పోటీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్స్ ప్రారంభించిన మరునాడే నాగ్పూర్లో బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్స్ అనుమతించింది. ఇంతకుముందు బుకింగ్ స్లాట్స్.. పుణె, బెంగళూరులకే పరిమితం.