ముంబై, జూన్ 16: క్రూడాయిల్ భగ్గుమంటున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర బుధవారం 75 డాలర్ల స్థాయిని సమీపించింది. ఇంటర్కాంటినెంటల్ ఎక్సేంజ్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 74.73 డాలర్లను తాకింది. ఇది 32 నెలల గరిష్ఠం. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర పెరగడం వరుసగా ఇది ఐదో రోజు. ట్రెండ్ను ప్రతిబింబిస్తూ దేశంలో ఇంధన విక్రయ సంస్థలు తాజాగా పెట్రో ధరల్ని మరోమారు పెంచాయి. రానున్న రోజుల్లో దేశీయంగా లీటర్ పెట్రోల్ ధర రూ.120కి వెళ్ళినా ఆశ్చర్యంలేదని విశ్లేషకులు అంటున్నారు.