Sebi on Digital Gold | ఆన్లైన్ బిజినెస్ సంస్థ డిజిటల్ గోల్డ్ వాటాల క్రయ విక్రయాలను సెప్టెంబర్ 10 వరకు నిలిపేయాలని స్టాక్ బ్రోకర్లు, సంస్థ సభ్యులను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) కోరింది. డిజిటల్ గోల్డ్పై దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ (సెబీ) ఆంక్షలు విధించింది. సదరు డిజిటల్ గోల్డ్ యాజమాన్యం.. సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) రూల్స్-1957 (ఎస్సీఆర్ఆర్) నిబంధనలను ఉల్లంఘించిందని సెబీ పేర్కొంది. సెక్యూరిటీస్ లేదా కమొడిటీ డెరివేటివ్స్ మినహా డిజిటల్ గోల్డ్తో ఎటువంటి వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు జరుపొద్దని ఈ నెల 3న సెబీ నోటీసు జారీ చేసింది.
ఎస్సీఆర్ఆర్ నిబంధనలు డిజిటల్ గోల్డ్కు వర్తించబోవన్న అభిప్రాయం వినిపిస్తున్నది. తాజా ఆదేశాల ప్రకారం డిజిటల్ గోల్డ్ లావాదేవీలను సెబీ నియంత్రించనున్నదని తెలుస్తున్నది. డిజిటల్ గోల్డ్లో పెట్టుబడులు నాన్ బ్రోకింగ్ బిజినెస్ కిందకు వస్తుందని సెబీ భావిస్తున్నది. నియంత్రణ నిబంధనలు అమలులో లేకపోవడంతో సదరు కంపెనీలు ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
డిజిటల్ గోల్డ్, అగ్యుమెంట్ గోల్డ్, ఎంఎంటీసీ-పంప్ ఇండియా సంస్థలు భారత్లో కస్టమర్లకు వర్చువల్ గోల్డ్ను అందుబాటులోకి తెస్తాయి. ఎటువంటి ఖర్చులేని బీమా సౌకర్యంతో హై సెక్యూరిటీ వాలెట్లలో వాటిని భద్రపరుస్తారు. టైటాన్తోపాటు కొన్ని జ్యువెల్లరీ సంస్థలు, బ్యాంకులు డిజిటల్ గోల్డ్ విక్రయిస్తుంటాయి.
ఎన్ఎస్ఈ ఆదేశం మేరకు డిజిటల్ గోల్డ్లో పెట్టుబడులు పెట్టాలని తమ కస్టమర్లకు అప్స్టాక్స్, గ్రో, పేటీఎం మనీ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ వంటి స్టాక్ బ్రోకింగ్ సంస్థలు సూచించరాదు. డిజిటల్ గోల్డ్లో కస్టమర్లు పెట్టుబడులు పెట్టకుండా నిలువరించేందుకు వచ్చేనెల 10 వరకు ఈ సంస్థలకు ఎన్ఎస్ఈ గడువు విధించింది. ఎన్ఎస్ఈ ఆదేశాలను అమలు చేస్తామని మోతీలాల్ ఓస్వాల్ ప్రకటించింది. అయితే, గూగుల్ పే, ఫోన్పే వంటి సంస్థలకు ఎన్ఎస్ఈ నిబంధన వర్తించదు. ఏటా డిజిటల్ గోల్డ్ మార్కెట్ సుమారు రూ.5,000 కోట్లు ఉంటుంది.