న్యూఢిల్లీ: కంపెనీలు, వేతన జీవులు ప్రతి ఏటా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తారు. ఈ క్రమంలో తమకు వచ్చే ఆదాయ వనరుల వివరాలను దాచి పెడుతుంటారు. కానీ ఇక నుంచి అలా చేయడం సాధ్యమయ్యే పని కాదు. రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ.. టూల్స్ సాయంతో ఎక్కడేం జరిగినా అట్టే పట్టేయొచ్చు.
అలా ఆదాయ వనరులు బయట పెట్టకుండా దాచిపెట్టిన వారి ఆర్థిక లావాదేవీలపై ఐటీ శాఖ వర్గాలు నిఘా పెట్టాయి. అందుకు మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ను ఉపయోగించాయి. ఇటీవల తమ ఆదాయ వనరులను దాచిపెట్టిన పలువురు వ్యక్తులు, కంపెనీలపై ఆదాయం పన్ను (ఐటీ) శాఖ నిఘా పెరిగింది.
ఆదాయం పన్నుశాఖతోపాటు వివిధ పన్ను సంస్థలు తమ వద్ద ఉన్న డేటాను షేర్ చేసుకున్నాయి. అంతే ఆదాయ వనరుల వివరాలు బహిర్గతం చేయని వారి డేటా వెలుగు చూసింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల గణాంకాలను అడిట్ చెక్లిస్ట్ క్రియేట్ చేయడానికి ఉపయోగించారు.
తమ వద్ద అందుబాటులో ఉన్న టూల్ను వినియోగించాయి ఐటీ వర్గాలు. వివిధ పరిశ్రమల యాజమాన్యాలు చెల్లించిన సగటు పన్నుల ఆధారంగా వ్యత్యాసాలను కనిపెట్టేశాయి. తదుపరి స్క్రూటినీ తో లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి.
ఆదాయం పన్ను, పరోక్ష పన్ను ఫైలింగ్స్లో తేడాల ఆధారంగా పలువురు వ్యక్తులు, కంపెనీలకు ఈ నెలలో పరోక్ష పన్నుల విభాగం నోటీసులు జారీ చేసింది. వివిధ పన్ను సంస్థల మధ్య సమన్వయంతో లోతుగా జరిపిన అధ్యయనంతో మరింత మందికి నోటీసులు వెళ్లాయి.
ఇలా ఈ ఏడాది నోటీసులు అందుకున్న వారిలో కొందరు న్యాయవాదులు కూడా ఉన్నారు. నోటీసులు అందుకున్న వారు పన్ను మినహాయింపులు, పన్ను చెల్లించక పోవడానికి (not pay taxes) కారణాలు వివరించాల్సి ఉంటుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఐటీ అధికారులు డేటాను తనిఖీ చేస్తే పన్ను ఎగవేతలు, ఆదాయం వివరాలను దాచిపెట్టడం వంటి వివరాలన్నీ బయటపడుతుంటాయి.
కనుక వ్యాపారాన్ని విస్తరించాలని భావించే వారు పన్ను ఎగవేతలకు పాల్పడకుండా, అనవసర నోటీసులు తప్పక నివారించాలని ఖైతాన్ అండ్ కో అనే లా ఫర్మ్ పార్టనర్ అభిషేక్ ఏ రస్తోసి చెప్పారు.
ఇంతకుముందు కూడా కొన్ని కంపెనీలు తమ గూడ్స్ సేల్స్తో వచ్చే ఆదాయం వివరాలను తక్కువ చేసి చూపిన వివరాలను ఐటీ శాఖ బయటపెట్టింది. తాజాగా వివిధ విభాగాల మధ్య పంపిణీ అయిన డేటా ఆధారంగా బినామీ ఆస్తులు, రియాల్టీ ఆస్తుల వివరాలను వెలికి తీసేందుకు ఐటీ శాఖ ప్రయత్నిస్తున్నది.