ఫిన్లాండ్: వైర్లెస్ నెట్వర్క్ పరికరాల తయారీ సంస్థ నోకియా భారీ స్థాయిలో ఉద్యోగుల కోతకు సిద్ధమవుతున్నది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా దాదాపు 10 వేల మంది సిబ్బందిని తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. మొత్తం సిబ్బందిలో ఇది పది శాతం వాటా. పరిశోధన, డెవలప్మెంట్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు 5జీ టెక్నాలజీ రంగానికి అవసరమైన పరికరాలను సరఫరా చేయడానికి భారీ స్థాయిలో పెట్టుబడి పెడుతున్న ప్రస్తుత తరుణంలో ఉద్యోగుల తొలగింపునకు మొగ్గుచూపడం గమనార్హం. దీంతో వచ్చే రెండేండ్లకాలంలో సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 80-85 వేలకు తగ్గనున్నారు. 2023 నాటికి 715 మిలియన్ డాలర్ల ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది.
ఎస్బీఐకి రూ.2 కోట్ల ఫైన్
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కి రిజర్వుబ్యాంక్ గట్టి షాకిచ్చింది. నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడినందుకుగాను బ్యాంక్పై రూ.2 కోట్ల జరిమానా విధించింది ఆర్బీఐ. బ్యాంకింగ్ రెగ్యులేటరీ యాక్ట్ 1949 చట్టం ప్రకారం సంస్థ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ పేర్కొంది.